
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవిత దేని కోసం పోరాడుతున్నారో చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. సామాజిక న్యాయం కోసమా? గత పదేండ్లలో దోచుకున్న సొమ్ములో వాటా కోసమా? స్పష్టం చేయాలన్నారు. దోచుకున్న సొమ్ములో వాటా కోసం అయితే అది వారి కుటుంబ సమస్య అని, రాష్ట్ర ప్రజలకు సంబంధం లేని అంశమని ఆయన అన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియాతో చామల మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో వారి కుటుంబం ఎంత కమీషన్ తీసుకుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పదేండ్ల అవినీతిపై కేంద్ర, రాష్ట్ర విచారణ సంస్థలకు ఫిర్యాదు చేయాలని, ఈ అంశంపై తాను ఈడీ, సీబీఐ దగ్గరకు వస్తానని ఆయన తెలిపారు. ఫిర్యాదు చేస్తేనే తెలంగాణ ప్రజలకు మీ మీద నమ్మ కం ఏర్పడుతుందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఈ దయ్యాలు, కోవర్టులు లేరని.. అధికారంలోకి వచ్చాక వచ్చారన్నారు. యుద్ధంలో జరిగిన నష్టం, దాని ఫలితాలు, రాజాసింగ్ వ్యాఖ్యల గురించి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ వారి పార్టీలో కూడా కోవర్టులున్నారని అన్నారని చామల గుర్తుచేశారు. విదేశాలకు పంపిన ఎంపీలలో ఏపీ నుంచి ఇద్దరికి అవకాశం ఇచ్చిన కేంద్రం.. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలలో ఒక్కరికి కూడా ఎందుకు ఇవ్వలేదని చామల ప్రశ్నించారు. వీరిలో ఎవరూ అర్హులు కాదా? వీళ్లని ప్రధాని మోదీ లైట్గా తీసుకున్నారా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డల్లాస్లో జూన్ 2న ఉత్సవాల కోసం 25 మంది బీఆర్ఎస్ఎమ్మెల్యేలు వెళ్లి జనసమీకరణ చేస్తున్నారని, అమెరికాలో బస్సులు ఉండవని, అలాంటప్పుడు విమానాల్లో తరలిస్తారా? అని చామల ఎద్దేవా చేశారు.