హైదరాబాద్: ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ ఎజెండాలో నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ స్కీం అంశాన్ని చేర్పించాలంటూ ఎంపీ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. రాజకీయ దురుద్ధేశంతో ఈ స్కీంను టీఆర్ఎస్ ప్రభుత్వం అటకెక్కించిందని ఆయన ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదం పొందిన ఈ లిఫ్ట్ స్కీం తెలంగాణ హక్కు అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని గతంలో తాను రాసిన లేఖకు స్పందనగా కేఆర్ఎంబీ సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు.
ఏపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్వి ఉత్తుత్తి హూంకరింపులు, గాండ్రింపులేనని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. జగన్ సర్కార్ కయ్యానికి కాలుదువ్వుతోందని ఓ వైపు ఆరోపిస్తూనే… మరోవైపు ఆ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సాగునీటి కాంట్రాక్టుల విషయంలో వియ్యమెందుకు అని నిలదీశారు.