హైదరాబాద్, వెలుగు: దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన నెహ్రూ–గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కేసుల పేరుతో ఇబ్బంది పెట్టుడేందని ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించారు. ఇది బీజేపీ కుట్రలో భాగమేనని ఆరోపించారు. దీనికి నిరసనగా ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమాల్లో కార్యకర్తలు పాల్గొనాలని మంగళవారం పిలుపునిచ్చారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ పంపిన సమన్లకు ప్రతిస్పందనగా సోనియా గాంధీ ఈ నెల 21న విచారణకు హాజరవుతారని చెప్పారు. బీజేపీ కుట్రను తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ కేసులో మనీ లాండరింగ్ అబద్ధమని, ఈడీ నిరాధారమైన ఆరోపణలు చేసిందన్నారు. దేశంలో ఎన్నో సమస్యలున్నాయని, వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే మోడీ సర్కార్ ఈ పని చేస్తోందన్నారు.