
బెంగుళూర్: కర్నాటక పాలిటిక్స్ను షేక్ చేసిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) స్కామ్ కేసు విచారణ వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడా కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్ ఆదేశాల మేరకు కర్నాటక లోకాయుక్త విభాగం కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టింది. ఈ సమయంలో ముడా చైర్మన్ మరిగౌడ తన పదవికి రాజీనామా చేశారు. 2024, అక్టోబర్ 16న ముడా చైర్మన్ పదవికి రిజైన్ చేసిన మరిగౌడ.. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్యను కలిసి తన రాజీనామా లేఖను అందించారు.
సిద్ధరామయ్యకు సన్నిహితుడిగా పేరున్న మరిగౌడ రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేశారనే వాదనను మరిగౌడ కొట్టిపారేశారు. అనారోగ్య సమస్యల కారణంగా ముడా చైర్మన్ పదవి నుండి తప్పుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.గతంలో తాను అనారోగ్యానికి గురి అయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాజీనామా చేయమని తనపై ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ లేదని.. హెల్త్ ఇష్యూ్స్ వల్ల తానే స్వచ్ఛందంగా పదవి నుండి తప్పుకున్నానని క్లారిటీ ఇచ్చారు.
ALSO READ | వారణాసిలో గంగా నదిపై రైలురోడ్డు బ్రిడ్జ్ : కేంద్ర కేబినెట్ ఆమోదం
కాగా, ముడా స్కామ్లో సీఎం సిద్ధరామయ్య, ఆయన సతీమణి పార్వతితో పాటు మరిగౌడపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ముడా కుంభకోణంలో మరిగౌడ హస్తం కూడా ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి. సిద్ధరామయ్యతో పాటు మరిగౌడ తన పదవులకు రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. అయినప్పటికీ పదవి నుండి తప్పుకోని మరిగౌడ.. సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్ విచారణుకు ఆదేశించడం.. కేసు నమోదు చేసి లోకాయుక్త ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన సమయంలో రాజీనామా చేయడం కన్నడ పాలిటిక్స్లో చర్చనీయాశంగా మారింది.
అసలు ముడా స్కామ్ కేసు ఏంటంటే..?
సిద్ధరామయ్య భార్య పార్వతమ్మ పేరిట ఉన్న భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్అర్బన్ డెవలప్మెంట్అథారిటీ (ముడా) సేకరించింది. అయితే దానికి ప్రతిఫలంగా అప్పట్లో సిద్ధరామయ్య సీఎంగా ఉన్న టైమ్లో ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు. గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.నాగప్రసన్న తీర్పు వెలువరించారు.
గవర్నర్ చట్టప్రకారమే విచారణకు ఆదేశించారని, అందులో ఎలాంటి లోపాలు లేవని పేర్కొన్నారు. అయితే తీర్పుపై రెండు వారాలు స్టే ఇవ్వాలని సిద్ధరామయ్య తరఫు లాయర్ అభిషేక్ మను సింఘ్వీ కోరగా.. తాను ఇచ్చిన ఆదేశాలపై తానే స్టే విధించలేనని జడ్జి తెలిపారు. కాగా, హైకోర్టు తీర్పుతో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు ట్రయల్ కోర్టు లోకాయుక్తకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ట్రయల్ ఆదేశాల మేరకు కర్నాటక లోకాయుక్త విభాగం సీఎం సిద్ధరామయ్య, అతడి సతీమణితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసి విచారణ చేసేందుకు రెడీ అయ్యింది. లోకాయుక్త ఫిర్యాదు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై ఇదే కేసులో సీఎం సిద్ధరామయ్య, ఆయన సతీమణిపై ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది.