పార్టీని బతికించుకోవాలి.. కార్యకర్తలకు రేవంత్ లేఖ

పార్టీని బతికించుకోవాలి.. కార్యకర్తలకు రేవంత్ లేఖ

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా మునుగోడుకు తరలిరావాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోరారు . మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేమని... అక్కడ కాంగ్రెస్ పై కుట్ర జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్ ను అంతం చేయడమే లక్ష్యంగా బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయన్నారు. దుష్టశక్తులన్నీ ఏకమై కాంగ్రెస్ ను ఒంటరి చేయాలని అనుకుంటున్నాయని ఆరోపించారు.  అధికార, ఆర్థిక బలాలతో కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేసి ఊపిరి తీయాలని కక్షకట్టారని మండిపడ్డారు రేవంత్. కాంగ్రెస్ భిక్షతో ఎదిగి వాళ్లే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. 

సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే పైసాకి పనికిరాని వాళ్లు రాజ్యాలేలుతూ కాంగ్రెస్ ని అంతం చేయడానికి కుయుక్తులు పన్నుతున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తుంటే... రాష్ట్ర పోలీసులు, స్థానిక అధికార గణాన్ని టీఆర్ఎస్ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని సైతం రాజకీయ లబ్ధికి వేదికగా మార్చారని పేర్కొన్నారు. ఆడబిడ్డ అన్న ఇంగిత జ్ఞానం లేకుండా పాల్వాయి స్రవంతిపై రాళ్ల దాడులకు తెగబడ్డారన్నారు.  ఈ నేపథ్యంలో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త.. మునుగోడుకు తరలివచ్చి పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉందంటూ కార్యకర్తలకు రేవంత్ లేఖ రాశారు.