దేశంలోని షెడ్యూల్డ్ కులాల ప్రయోజనాలను పరిరక్షించడానికి పనిచేసే రాజ్యాంగ సంస్థ షెడ్యూల్డ్ కులాల కమిషన్. ఇది ఎస్సీ కమ్యూనిటీకి వివక్ష, దోపిడీ నుంచి రక్షణ కల్పించడంతోపాటు దళిత కమ్యూనిటీని ఉద్ధరించడానికి, సౌకర్యాలను అందించడానికి ప్రయత్నిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 338 జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటును తెలుపుతుంది. మొదట్లో ఆర్టికల్ 338 ప్రకారం ప్రత్యేక అధికారిని నియమించారు. ఈ ప్రత్యేక అధికారిని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషనర్గా నియమించారు. 1987లో పార్లమెంటు సభ్యుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఏకసభ్య కమిషన్కు బదులుగా బహుళ సభ్య కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
65వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏకసభ్య వ్యవస్థ స్థానంలో బహుళ సభ్య జాతీయ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ను ఏర్పాటు చేసింది. రాజ్యాంగం (65వ సవరణ) చట్టం 1990, రాజ్యాంగంలోని ఆర్టికల్ 338ని సవరించింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం కొత్తగా ఏర్పడిన జాతీయ కమిషన్లో కమిషన్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ కాకుండా ఐదుగురు సభ్యులు ఉన్నారు. 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ నుంచి షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ను వేరు చేశారు. 2004 నుంచి ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పడ్డాయి. షెడ్యూల్డ్ కులాల కోసం మొదటి జాతీయ కమిషన్ సూరజ్ భాన్ అధ్యక్షతన 2004లో ఏర్పడింది. ప్రస్తుత కమిషన్ ఏడోది.
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్లో ఒక చైర్మన్ వైస్ చైర్మన్, ముగ్గురు సభ్యులు అంటే మొత్తం ఐదుగురు సభ్యులతో కూడి ఉంటుంది.
మూడేండ్ల పదవీ కాలానికిగాను రాష్ట్రపతి నియమిస్తాడు.
మొదటి చైర్మన్: సూరజ్ భాన్
ప్రస్తుత చైర్మన్: కిశోర్ మక్వానా
విధులు:
1. ఎస్సీలకు సంబంధించిన రాజ్యాంగబద్ధ, చట్టబద్ద హక్కుల అమలు తీరు, వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులపై విధులను కలిగి ఉంటుంది.
2. ఎస్సీల సామాజిక ఆర్థిక వికాసం కోసం తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది.
3. వార్షిక నివేదికలను, అవసరమైన సందర్భంలో ఇతర నివేదికలను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
4. రాష్ట్రపతి నివేదికను పార్లమెంట్ ముందు ఉంచుతాడు. వీరి సూచనలపై ప్రభుత్వం చర్యలు తీసుకోని సందర్భంలో పార్లమెంట్కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
5. రాష్ట్రపతి సూచించిన ఇతర బాధ్యతలు స్వీకరిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరినప్పుడు ఆయా బాధ్యతలు నిర్వర్తిస్తుంది.
నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్
వార్షిక ఆదాయం 3 లక్షల కంటే తక్కువగా ఉన్న షెడ్యూల్డ్ కులాల కుటుంబాలకు ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం రుణ సదుపాయం అందిస్తున్నారు. ఈ సంస్థ క్రెడిట్ బేస్డ్ స్కీమ్, నాన్ క్రెడిట్ బేస్డ్ స్కీమ్ అనే పథకాలను అమలు చేస్తున్నాయి. క్రెడిట్ బేస్డ్ స్కీమ్లో భాగంగా మహిళా సంవృద్ధి యోజన, మహిళా అధికారిక యోజన, లఘు వ్యవసాయ యోజన, గ్రీన్ బిజినెస్ స్కీమ్, స్టాండప్ ఇండియా, స్వచ్ఛతా ఉదయం యోజన, అజీవక మైక్రో ఫైనాన్స్ యోజన, ఉదయం నిధి యోజన తదతర పథకాలు అమలుచేస్తుండగా, నాన్ క్రెడిట్ బేస్డ్ స్కీమ్లో భాగంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందిస్తున్నాయి.
►ALSO READ | బీడీఎల్ లో ఇంజినీర్ పోస్టులు..లాస్ట్ డేట్ ఆగస్టు 21
