1948, సెప్టెంబర్ 18న జయంతోనాథ్ చౌదరి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్గా జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలో బాధ్యతలు స్వీకరించాడు. మిలటరీ గవర్నర్ కార్యనిర్వాహక మండలి 1948, సెప్టెంబర్ 24న ఏర్పడి 1949, డిసెంబర్ 31 వరకు పనిచేసింది. కానీ రాజ్యాధినేతగా పరిపాలన మొత్తం నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేరు మీదనే జరిగింది. మిలటరీ గవర్నర్ కార్యనిర్వాహక మండలిలో మిలటరీ గవర్నర్ – జె.ఎన్.చౌదరి, చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ – డి.ఎస్.బాక్లే, అడిషనల్ చీఫ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ – డి.ఆర్.ప్రధాన్. 1949, ఫిబ్రవరి 6న జె.ఎన్.చౌదరి ఒక ఫర్మానా జారీ చేశాడు.
ఈ ఫర్మానా ప్రకారం..
- నిజాం ప్రభుత్వ కరెన్సీ హలిసిక్కా రద్దయింది.
- నిజాం సొంత ఆస్తిగా పరిగణించే సర్ఫేఖాస్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది. నష్టపరిహారంగా రూ. 3 కోట్లు చెల్లించింది.
- హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారానికి బదులుగా ఆదివారం సెలవు దినంగా ప్రకటించారు.
