మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి పెను ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శివసేన తర్వాత ఎన్సీపీలో పెద్ద చీలిక వచ్చింది. అజిత్ పవార్ తన మద్దతు ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలిశారు. ఆయన తన ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
9 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వెంట ఉన్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీకి మొత్తం 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల శరద్పవార్ తన కుమార్తె సుప్రియాసూలే, ప్రఫుల్ పటేల్లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ప్రకటించడమే అజిత్ పవార్ నిర్ణయం వెనుక కారణంగా తెలుస్తోంది.