ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బెంగాల్ గవర్నర్

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న సస్పెన్స్కు తెరపడింది. వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను ఎంపిక చేసింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సుదీర్ఘ చర్చ అనంతరం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన పేరు ప్రకటించారు. జులై 19తో ఉప రాష్ట్రపతి అభ్యర్థుల నామినేషన్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు జగదీప్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఇవాళ ఉదయం ధన్ కర్ ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో ధన్‌కర్ పేరును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించడం విశేషం.

అనూహ్యంగా తెరపైకి
ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా కేంద్రమాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా,  పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్,  గవర్నర్లు ఆనందీబెన్ పటేల్, తమిళిసై సౌందరరాజన్, థావర్‌చంద్ గెహ్లాత్‌ల పేర్లు వినిపించాయి. అయితే బీజేపీ అనూహ్యంగా జగదీప్ ధన్కర్ పేరు తెరపైకి వచ్చింది. శుక్రవారం ధన్ కర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. 

న్యాయవాదిగా గుర్తింపు
ప్రస్తుతం బెంగాల్ గవర్నర్గా ఉన్న జగదీప్ ధన్కర్ 1951 మే 18న రాజస్థాన్లోని కుగ్రామంలో జన్మించారు. చిత్తోఢ్ఘడ్ సైనిక్ స్కూల్ నుంచి విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన.. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన జగదీప్.. సుప్రీంకోర్టులో పలు కేసులు వాదించారు. రాజస్థాన్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. 

జనతాదళ్తో రాజకీయ అరంగేట్రం
1989లో ధ‌న్‌క‌ర్‌ జ‌న‌తాద‌ళ్ త‌ర‌ఫున జున్ జునూ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు. 1993 నుంచి 1998 వరకు కిషన్ఘడ్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 జులై 30న జగదీప్ ధన్కర్ వెస్ట్ బెంగాల్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.