మెహిదీపట్నం, వెలుగు: నీలోఫర్ ఆసుపత్రిలో పీజీ మెడికల్ స్టూడెంట్స్పై పేషెంట్ బంధువులు దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. ఇందుకు నిరసనగా మెడికల్ స్టూడెంట్స్ సోమవారం విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు.
హాస్పిటల్ సూపరింటెండెంట్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థుల ప్రతినిధి చంద్రకాంత్రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 2న ఊపిరితిత్తుల సమస్యతో హాస్పిటల్లో ఆరేళ్ల బాలిక చేరిందని, ఆమె చికిత్స పొందుతున్న సమయంలో కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఐసీయూకు రావడం వల్ల డాక్టర్లకు ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు.
శనివారం రాత్రి బాలిక బంధువులు పీజీ సెకండియర్ డాక్టర్ నందన్, ఫస్టియర్ డాక్టర్ చందనతో వాగ్వాదానికి దిగడంతో పాటు వారిపై దాడి చేశారని ఆరోపించారు. ఆసుపత్రి వార్డులోని సామగ్రిని కూడా ధ్వంసం చేశారని పేర్కొన్నారు.
దాడి ఘటనపై ఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు డాక్టర్లకు కాకుండా దాడికి పాల్పడిన వారికే మద్దతుగా వ్యవహరించారని ఆరోపించారు. నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకుంటామని డీఐ ప్రసాదరావు హామీ ఇవ్వడంతో మెడికల్ స్టూడెంట్లు తాత్కాలికంగా నిరసన విరమించారు.
