నవ వధువు హత్య: ప్రియురాలు ఆత్మహత్య..?

నవ వధువు హత్య: ప్రియురాలు ఆత్మహత్య..?

ఖమ్మం జిల్లా : ప్రియురాలి మోజులోపడి వివాహమై రెండునెలలు కాకముందే భార్యను చంపేశాడు ఓ దుర్మార్గుడు. ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లా మధిర మండలం ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెం గ్రామానికి చెందిన నవ్య రెడ్డి (22)కి అదే గ్రామానికి చెందిన తన మేనమామ కుమారుడు నాగశేషుతో రెండు నెలల క్రితం వివాహమైంది. నవ్యరెడ్డి సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. నాగశేషు రెడ్డి పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నెల 3న నాగశేషు రెడ్డి భార్యను కళాశాలతో దించుతానని బైక్‌పై ఎక్కించుకొని బయల్దేరాడు. పెనుబల్లి మండలం కొత్త లంకపల్లి గ్రామశివారులోని కుక్కలగుట్ట వద్దకు రాగానే ఆమెకు మత్తు బిళ్లలు కలిపిన నీటిని తాగించాడు.

అపస్మారక స్థితికి చేరిన ఆమెను సమీప పొదల్లోకి తీసుకెళ్లి చున్నీతో ఉరి బిగించి హతమార్చాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమె సెల్‌ ఫోన్‌ నుంచి తండ్రికి తాను బ్యాక్‌ లాగ్స్‌ సబ్జెక్టులు ఉన్న కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెసేజ్ పంపాడు. తర్వాత ఏమీ తెలియనట్లు తన భార్య కనిపించడం లేదంటూ ఎర్రుపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిన్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా నాగశేషు రెడ్డిని అదుపులోకి తీసుకొచి విచారించారు. దీంతో తానే ఘాతానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ప్రియురాలు మోజులో భార్య నవ్యరెడ్డిని అడ్డు తొలగించుకునేందుకు నాగశేషు రెడ్డి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఈ ఘటన తెలిసి నాగశేషు రెడ్డి ప్రియురాలు కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. నిందితుడు నాగశేషు రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు పోలీసులను డిమాండ్‌ చేస్తున్నారు.