- హైకమాండ్ పరిశీలనలో ముకుల్ వాస్నిక్ , శక్తి సింగ్ గోయల్
- బాధ్యతల నుంచి తప్పుకోనున్న మీనాక్షి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి త్వరలోనే కొత్త ఇన్చార్జ్ రానున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఇన్చార్జ్గా కొనసాగుతున్న మీనాక్షి నటరాజన్ శనివారం ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. లండన్లో ఉన్నత చదువుల కోసం ఈ నెల 21న ఆమె ఢిల్లీ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. పది నెలల పాటు అక్కడే ఉండనున్నారు. ఇందుకు సంబంధించి ఆమె ఇప్పటికే హైకమాండ్ అనుమతి తీసుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ తరపున మీనాక్షి నటరాజన్కు వీడ్కోలు పలికేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. ఏడాదిన్నర కాలంగా రాష్ట్ర ఇన్చార్జ్గా పార్టీ బలోపేతానికి ఆమె చేసిన కృషిని ప్రశంసిస్తూ, ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయనున్నారు. మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త ఇన్చార్జ్ నియామకం కోసం కాంగ్రెస్ హైకమాండ్ మహారాష్ట్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి ముకుల్ వాస్నిక్, గుజరాత్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ శక్తిసింగ్ గోయల్ పేర్లను పరిశీలిస్తోంది.
నామినేటెడ్ పదవుల భర్తీలో మరింత జాప్యం
గాంధేయవాద సిద్ధాంతాన్ని అనుసరించే మీనాక్షి నటరాజన్.. సంస్థాగత నియామకాలు, నామినేటెడ్ పదవుల భర్తీలో సీనియర్లకు పెద్దపీట వేయడంలో కీలక పాత్ర పోషించారని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆమె తప్పుకుంటుండటంతో నామినేటెడ్ పదవుల ప్రకటనలో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా, ఇదే నెలాఖరులో జరగాల్సి ఉన్నకేబినెట్ విస్తరణపై ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త ఇన్చార్జ్తో తమ అవకాశాలు సన్నగిల్లుతాయని మంత్రి పదవులు ఆశిస్తున్నవారు భావిస్తున్నారు.
