మైహోం పేరిట 2,463 ఎకరాలు..శంషాబాద్ ఎయిర్ పోర్టును ఆనుకొని జాగా 

మైహోం పేరిట 2,463 ఎకరాలు..శంషాబాద్ ఎయిర్ పోర్టును ఆనుకొని జాగా 
  • శంషాబాద్ ఎయిర్ పోర్టును ఆనుకొని జాగా
  • ఒకే వ్యక్తికి చెందిన 28 కంపెనీల పేర రిజిస్టర్
  • ఇందులో భూదాన్, అసైన్డ్ భూములు
  • కేసీఆర్ బినామీయే ఈ మైహోం: సీఎం

హైదరాబాద్, వెలుగు:  ‘మాజీ సీఎం కేసీఆర్​ హోమే మై హోమ్​.. ఈయన కేసీఆర్​ బినామే అని రాష్ట్రంలో అందరికీ తెలిసిందే’ అని  సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. హైదరాబాద్​ లోని శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ను ఆనుకొని ‘మై హోం’ కు 2,463 ఎకరాల భూమి ఉందన్నారు. ఒకే వ్యక్తికి చెందిన 28 కంపెనీల పేర్లపై ఇవి రిజిస్టరై ఉన్నట్లుగా తెలిపారు. ఇందులో ప్రభుత్వ నిషేధిత జాబితాలోని, భూదాన్​, అసైన్డ్​ భూములు కూడా ఉన్నాయన్నారు. రూ.వేల కోట్ల విలువ చేసే జాగాలను ఈ కంపెనీలకు అప్పగించడం వెనుక మాజీ సీఎం కేసీఆర్​ కుట్ర దాగి ఉందని సీఎం ఆరోపించారు. ముచ్చింతల, పాలమాకుల , మదనపల్లి, పెద్దతూప్ర, సాగిడి, గొల్లూరు, నందనపల్లి, తూప్ర, నాగారం, వెంకన్నగూడ తదితర గ్రామాల్లో మొత్తం 2,463 ఎకరాల భూములను ‘మై హోం’ కంపెనీలకు ధారాదత్తం చేసినట్లుగా సీఎం వెల్లడించారు. 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ పక్కన ప్రభుత్వ భూమి ఎంత ఉందో .. అంతే స్థాయిలో ప్రైవేట్​ వ్యక్తులకు భూములు ఉన్నాయన్నారు.  గొల్లూరు గ్రామంలో నిషేధిత జాబితాలో 301.07 ఎకరాల భూమిని,  నాగారంలో సర్వే నెంబర్​ 195 లో 315 ఎకరాలు  నిషేధిత జాబితాలోని భూములను 2014 తర్వాత కేసీఆర్​ సర్కారు రికార్డులను మార్చి డీ నోటిఫై చేసి కేసీఆర్​ బినామీ ‘ మై హోం’ కంపెనీకి అప్పగించారన్నారు.  కాప్రాలోని మేళ్ల చెరువు మై హోం సిమెంట్​ ఫ్యాక్టరీ దగ్గర 242 ఎకరాల భూములు ఉండగా ఇందులో 113 ఎకరాల ప్రభుత్వ భూదాన్​ భూములని ప్రాథమికంగా లెక్క తేలిందన్నారు. 

ఈ భూములన్నీ మై హోం కంపెనీకి ఎట్లా వచ్చాయని సీఎం ప్రశ్నించారు. ‘ఇన్నేళ్లు ఎవరి సొమ్ము ఎవరు తిన్నారు.. సామాన్యులు కోట్లకు అధిపతులుగా ఎలా మారారు? వాళ్లు తప్పులు చేసి మాపై బురద జల్లడం ఏంటి? ’ అని సీఎం మండి పడ్డారు. గద్దల్లా వాలి ప్రభుత్వ, పేదల ఆస్తులు కాజేసి ఆగర్భ శ్రీమంతులు అయ్యారని ధ్వజమెత్తారు.  ‘ఆంధ్రా వాళ్లు ఈ భూములను కాజేస్తున్నారని కేసీఆర్​ ఓ పత్రికలో పెద్ద, పెద్ద అక్షరాలతో వార్తలు రాయించారని, ఆ పత్రికలో వచ్చిన సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములకు సంబంధించినవేనని చెప్పారు. ఆ తర్వాత ఆంధ్రా వాళ్లను బెదిరించి  అవే భూములను ‘మై హోం’ కు అప్పగించారని అని సీఎం వెల్లడించారు.