జగిత్యాల రూరల్, వెలుగు: క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించి ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన ఘటనలో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు జగిత్యాల డీఎస్పీ పురుషోత్తం రెడ్డి తెలిపారు. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన మానాల మారుతి గతంలో కొన్ని రోజులు కనిపించకుండా పోవడంతో ఆయన భార్య ఫిబ్రవరి 19న జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ నెల 15న మారుతి పోలీసులను ఆశ్రయించి బెజ్జంకి అనిల్రావు మరికొందరి సహకారంతో తనను కిడ్నాప్ చేసినట్లు ఫిర్యాదు చేశాడు.
గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారని, డబ్బులు ఇవ్వాలని, తన ఇంటిని తాము సూచించిన వ్యక్తుల పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించారని తెలిపాడు. లేదంటే చంపేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నాడు. మారుతి స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు అనిల్ రావుతో పాటు కిడ్నాప్కు సహకరించిన జగదీశ్వర్, శ్రీకృష్ణ, నిఖిల్, దీక్షిత్, రెహమాన్, సాయిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక కారు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
