
కామారెడ్డి, వెలుగు: పెళ్లయిన 19 రోజులకే పెళ్లికొడుకు రోడ్డుప్రమాదంలో చనిపోయాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ మాకులపేట గ్రామాల బుధవారం రాత్రి మధ్య కల్వర్టును ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకేంద్రంలోని శివాజీరోడ్డుకు చెందిన గంటా భాస్కర్ (28) చనిపోయాడు. కామారెడ్డి ప్రాంతానికే చెందిన యువతితో భాస్కర్కు ఇటీవలే పెళ్లయ్యింది. ఎలక్ర్టిషియన్గా పని చేసే భాస్కర్ లాక్డౌన్, పెళ్లి పనుల వల్ల చాలాకాలంగా బయటకు వెళ్లలేదు. బుధవారం ఉదయం భాస్కర్ స్నేహితులతో కలిసి కారులో మంచిర్యాల జిల్లాకు వెళ్లారు. ఒక ఫ్రెండ్ను దింపేందుకు ఖానాపూర్ వెళ్తుండగా మార్గమధ్యంలో కారు ప్రమాదానికి గురైంది. కారును డ్రైవర్ క్రిష్ణ అతి వేగంగా నడుపగా ఇరుకు వంతెనకు డీకొట్టి ఫల్టీలు కొట్టిందని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుండగానే భాస్కర్ చనిపోయాడు. అతని స్నేహితులు బింగి నరేశ్, చందు, క్రిష్ణ, ఆనంత్ చికిత్స పొందుతున్నారు. ఇటివలనే పెళ్లి జరిగిన యువకుడు రోడ్డు ప్రమాదంతో చనిపోవటంతో రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.