
లక్నో: వయసు మీరిపోతున్నా పెళ్లి కావడంలేదని ఆరాటపడ్డాడో రైతు.. తనకున్న ఆస్తిని అనుభవించేందుకు వెనకాముందు ఎవరూలేరని ఓ ఆధ్యాత్మిక గురువుకు బహిరంగంగా చెప్పుకుని బాధపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతడి ఆస్తిని కాజేసేందుకు ఓ ముఠా పక్కాగా ప్లాన్ చేసింది.
హత్యకు ముందే ప్లాన్ చేసి, పెండ్లయ్యాక చంపేసింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగిన ఈ దారుణంలో మధ్యప్రదేశ్ కు చెందిన యువ రైతు ఇంద్రకుమార్ తివారీ జీవితం విషాదంగా ముగిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జబల్పూర్ జిల్లాలోని పదర్వార్ (ఖిటోలా) గ్రామానికి చెందిన ఇంద్రకుమార్ తివారీ (45) వ్యవసాయం చేస్తూ, పార్ట్ టైమ్ టీచర్ గా పనిచేస్తున్నాడు.
వెనకా ముందు ఎవరూ లేని ఇంద్రకుమార్..పెళ్లి కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన ఇంద్రకుమార్.. అక్కడ ప్రసంగించిన గురువుతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. తనకు 18 ఎకరాల సొంత భూమి ఉన్నా కూడా పెళ్లి సంబంధం కుదరడంలేదని వాపోయాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో చూసి ఉత్తరప్రదేశ్లోని ఓ ముఠా ఇంద్రకుమార్ను ట్రాప్ చేసింది.
ఖుషి తివారీ అనే పేరుతో పరిచయం
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ కు చెందిన సాహిబా బానో అనే మహిళ సోషల్ మీడియా వేదిక ద్వారా ఇంద్రకుమార్ ను పరిచయం చేసుకుంది. తనను తాను ‘ఖుషి తివారీ’ పేరుతో పరిచయం చేసుకుంది. అతడిని పెళ్లాడేందుకు సిద్ధమని, వివాహం మాత్రం కుషినగర్లోనే జరగాలని కండీషన్ పెట్టింది. ఎట్టకేలకు తనకు పెళ్లి కాబోతున్నందుకు ఇంద్రకుమార్ ఎంతో సంతోషించాడు.
కుషినగర్ వెళ్లి ‘ఖుషి తివారీ’గా నమ్మించిన సాహిబా బానోను పెండ్లి చేసుకున్నాడు. ఇంతకాలానికి తను కూడా ఓ ఇంటివాడయ్యాననే ఆనందంలో ఉన్న ఇంద్రకుమార్ను బానో తన అనుచరులతో కలిసి హత్య చేసింది. అతడి వద్ద ఉన్న డబ్బు, నగలు తీసుకుని పారిపోయింది. జూన్ 6న కుషినగర్లోని జాతీయ రహదారి పక్కనున్న పొదల్లో ఇంద్రకుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అతడి మెడలో కత్తి దిగి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.