కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యల వీడియోను.. వాటితో ఏ మాత్రం సంబంధం లేని నేరపూరిత ఘటనకు జోడించి ప్రసారం చేసిన అంశం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. ప్రముఖ నేషనల్ చానల్ లో ప్రసారమైన ఈ వార్తా కథనాన్ని చదివిన న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్ ను అరెస్టు చేసేందుకు ఛత్తీస్ గఢ్ పోలీసులు యూపీలోని రంజన్ ఇంటికి చేరుకున్నారు. దీంతో రోహిత్ రంజన్ వెంటనే యూపీ పోలీసులకు ఎస్ఓఎస్ పంపారు. దీంతో అక్కడికి చేరుకున్న నోయిడా (ఉత్తరప్రదేశ్) పోలీసులు.. రోహిత్ రంజన్ ను అరెస్టు చేయకుండా ఛత్తీస్ గఢ్ పోలీసులను అడ్డుకున్నారు.
ఛత్తీస్ గఢ్ పోలీసులు యూపీకి ఎందుకొచ్చారు ?
పలువురు దుండగుల చేతిలో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్లో కన్హయ్య లాల్ జూన్ 28న దారుణ హత్య కు గురైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని ప్రసారం చేసిన ఆ మీడియా సంస్థ.. దానితో ఏ మాత్రం సంబంధం లేని వీడియో బైట్స్ (రాహుల్ గాంధీ వ్యాఖ్యలు)ను చివర్లో జోడించింది. ‘‘కొంతమంది పిల్లలు ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. వాళ్లు పిల్లలు.. వాళ్లను క్షమించండి” అని రాహుల్ గాంధీ చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. కన్హయ్య లాల్ ను హత్య చేసిన వారిని ఉద్దేశించి.. రాహుల్ గాంధీ ఇలా మాట్లాడారు అనేలా కథనాన్ని ప్రసారం చేశారు. అదే విధమైన స్క్రిప్ట్ ను యాంకర్ రోహిత్ రంజన్ చదివారు. దీనిపై దుమారం రేగడంతో కొన్ని గంటల్లోనే సదరు మీడియా సంస్థ ఆ తప్పుడు వార్తను తొలగించి, క్షమాపణలు ప్రకటించింది. మానవ తప్పిదం వల్ల జరిగిన తప్పును అంగీకరిస్తున్నట్లు వెల్లడించింది. అయినా కాంగ్రెస్ పాలిత ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పలువురు కాంగ్రెస్ నేతలు రోహిత్ రంజన్ పై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే ఛత్తీస్ గఢ్ పోలీసులు యాంకర్ ను అరెస్టు చేసేందుకు యూపీలోని ఆయన నివాసానికి వచ్చారు. వాస్తవానికి ‘‘కొంతమంది పిల్లలు ఇలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. వాళ్లు పిల్లలు.. వాళ్లను క్షమించండి” అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కేరళలోని వయనాడ్ ఘటనతో ముడిపడినవి. వయనాడ్ లోని రాహుల్ గాంధీ కార్యాలయంపై ఇటీవల ఓ విద్యార్థి సంఘం నాయకులు దాడి చేశారు. వాళ్లను ఉద్దేశించి రాహుల్ ఆ వ్యాఖ్యలు చేశారు.