
భోపాల్: మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ ఓ ప్యాసింజర్ వ్యాన్పై బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో వ్యాన్లోని 9 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం (జూన్ 4) తెల్లవారుజామున జాబువా జిల్లాలోని మేఘ్నగర్ తహసీల్లోని సంజెలి రైల్వే క్రాసింగ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న రైలు ఓవర్-బ్రిడ్జి (ROB) దాటుతుండగా ట్రక్కు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఝబువా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) పద్మవిలోచన్ శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేఘ్నగర్ సమీపంలో ప్యాసింజర్ వ్యాన్పై ట్రక్కు బోల్తా పడి తొమ్మిది మంది మరణించగా, ఇద్దరు గాయపడ్డారని తెలిపారు.
Also Read : పంజాబ్లో మరో పాక్ గూఢచారి అరెస్ట్
బుధవారం (జూన్ 4) తెల్లవారుజూము 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని చెప్పారు. మృతులు వివాహ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతులు అంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడించారు. ట్రక్కు బరువుకి వ్యాన్ నుజ్జునుజ్జు అయిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఒకేసారి 9 మంది చనిపోవడంతో బాధిత కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.