ప్రారంభమైన నీతిఆయోగ్ సమావేశం

ప్రారంభమైన నీతిఆయోగ్ సమావేశం

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన 5వ నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ప్రారంభమైంది. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ లక్ష్యంతో రాష్ట్రపతి భవన్ లోని సాంస్కృతిక కళా కేంద్రంలో ఈ భేటీ జరుగుతోంది. నీతి ఆయోగ్  వైఎస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్, కేంద్రమంత్రులు, దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రత్యేక ఆహ్వానితులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఈ భేటీకి హాజరుకాలేదు.

వర్షపు నీటి సంరక్షణ, కరవు పరిస్థితి, నివారణ చర్యలు, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం, ట్రాన్స్ ఫార్మింగ్  అగ్రికల్చర్, ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం, భద్రతాపరమైన అంశాలు ఏక్ భారత్ -శ్రేష్ఠ్ భారత్ వంటి  కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. సమావేశం తర్వాత ముఖ్యమంత్రులు, ఆహ్వానితులకు ప్రధాని మోడీ విందు ఇస్తారు.

మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగే  మొదటి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ , రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , చత్తీస్  గఢ్ , , సిక్కిం రాష్ట్రాల సీఎంలు మొదటిసారి హాజరుకాబోతున్నారు.