
‘నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్’ తీసిన టాప్ డైరెక్టర్ పవర్ పాలిట్రిక్స్ ముందు కళ నిలబడగలదా? కళాపుత్రుడు అశ్విన్కుమార్ ఆరు నెలలుగా ఈ రెండింటి ప్రతాపాన్ని చవి చూస్తున్నారు. అశ్విన్ ప్రముఖ దర్శకుడు. కథ, కథనంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే ఆయన సామర్థ్యం, రెండు జాతీయ స్థాయి అవార్డుల్ని తెచ్చి పెట్టింది. ఆ తర్వాత అశ్విన్ ఎంచుకున్న ప్రాజెక్టు కాశ్మీర్. ఇండియా మొత్తం ఒక ఎత్తయితే, కాశ్మీర్ ఒక్కటి మరో ఎత్తు అనేది చూపించాలనుకున్నారు. అందుకు ఇద్దరు టీనేజర్ల ప్రేమ కథను ఎంచుకున్నారు. ‘నో ఫాదర్స్ ఇన్ కాశ్మీర్ ’ అని సినిమాకు పేరు పెట్టారు. చిత్రీకరణ పూర్తి చేశారు. కానీ సెన్సార్ బోర్డు చిత్ర విడుదలకు అనుమతి ఇవ్వడం లేదు. సినిమాను నిషేధిస్తున్నామనో, లేదనో బోర్డు సభ్యులు చెప్పడం లేదు. దీంతో ఆర్నెల్లు గా సినిమా విడుదలకు నోచుకోవడం లేదు.
చిత్రంలో ప్రధాన పాత్రల పోషించిన హీరో, హీరోయిన్లకు కన్న తండ్రి ఎవరో తెలీదు. నాన్నల ఆచూకీ కోసం వెతుకుతూ కలుసుకుంటారు. ఆపై ప్రేమలో పడతారు. తన కథ కాశ్మీర్ యువత సమస్యను ప్రతిబింబిస్తుందని అశ్విన్ పేర్కొన్నారు. ఈ చిత్ర విడుదలను అడ్డుకోవడం వల్ల కాశ్మీర్ గురించి మిగతా దేశం తెలుసుకునే అవకాశం లేకుండా పోతుందని అన్నారు. గత ఏడాది జూలైలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికెషన్(సీబీఎఫ్సీ )కి సినిమాను పంపినట్లు చెప్పారు. నాటి నుంచి ఎన్నో ఈ మెయిళ్లు, రిక్వెస్ట్లు చేశానని, రెండు రివ్యూ మీటింగులకూ వెళ్లానని వెల్లడించారు. చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ ఇస్తామన్నారని, కొన్ని కట్స్ కూడా సూచించారని తెలిపారు. ప్రస్తుతం సినిమా విడుదలపై అశ్విన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అశ్విన్ తరఫు న్యాయవాది కరుణా నండి మాట్లాడుతూ “A” సర్టిఫికెట్నూ తాము తీసుకోబోమని స్పష్టం చేశారు.