ఇంక ఆ భూములు అమ్మలేరు

ఇంక ఆ భూములు అమ్మలేరు

ఆదిలాబాద్ లో రూ.1200 కోట్ల వ్యాపారానికి బ్రేక్

డీటీసీపీ రూల్స్​కు లోబడి లేని భూముల్లో నిలిచిన రిజిస్ట్రేషన్లు

అసైన్డ్​ భూములకు గతంలో ఎన్ వోసీలు

అనుమతుల్లే కున్నా అవే భూముల్లో యథేచ్ఛగా వెంచర్లు

రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖ తాజా ఆదేశాలతో అయోమయంలో రియల్టర్లు, లీడర్లు

ఆదిలాబాద్, వెలుగు: ఒకే ఒక్క ఆదేశంతో ఆదిలాబాద్ లో అతిపెద్ద భూదందాకు బ్రేక్ పడింది. డిస్ట్రిక్ట్​ టౌన్​ అండ్ కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) రూల్సుకు లోబడి లేని భూముల రిజిస్ట్రేషన్లు నిలిపి వేయాలంటూ రాష్ట్ర రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు ఇక్కడి రియల్ ఎస్టేట్​ రంగాన్ని ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. ఈ ఆర్డర్స్​తో ఆదిలాబాద్ సమీపంలో సుమారు రూ. 1200 కోట్ల విలువ జేసే 400 ఎకరాలకుపైగా భూముల్లో వేసిన వెంచర్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఫలితంగా అసైన్డ్​ భూములతో అక్రమ భూ వ్యాపారం చేస్తున్న రియల్టర్లు, వాళ్ల వెనుక ఉన్న లీడర్లలో, ఇప్పటికే ప్లాట్ లు కొన్నవారిలో ఆందోళన మొదలైంది.

నిలిచిన రిజిస్ట్రేషన్లు

హైవేను ఆనుకుని ఉన్న ఈ భూముల విలువ ఎకరానికి రూ.6 కోట్ల దాకా ఉంది. రోడ్డుకు కాస్త దూరంగా ఉన్న భూములైతే ఎకరానికి రూ.కోటి వరకు పలుకుతున్నాయి. సరాసరి రూ.3 కోట్లు అనుకున్నా మొత్తం భూముల విలువ రూ.1200 కోట్లకుపైగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రైమ్ లొకేషన్​ కావడంతో కొంత కాలంగా క్రయ, విక్రయాలు జోరుగా సాగుతూ వచ్చాయి. తాజాగా డీటీసీసీ అనుమతుల్లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేయరాదని ఉత్తర్వులు రావడంతో ఈ ప్లాట్ల సేల్, రీసేల్​ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఈ భూముల్లో ఇండ్లు కూడా నిర్మించకపోవడంతో రెగ్యులరైజ్ చేసుకునే ఆప్షన్​ కూడా లేకుండా పోయింది. దీంతో ఇక్కడ ప్లాట్ లు కొన్న వందలాది మందిలో ఆందోళన నెలకొంది. మరోవైపు ఈ భూముల్లో వందల కోట్ల దందా సాగిస్తున్న రియల్టర్లు, వారి వెనుక ఉన్న లీడర్లకు రెండు రోజులుగా కంటి మీద కునుకు కరువైంది.

అడ్డదారిలో ఎన్ వోసీలు

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఫోర్ లేన్స్​ హైవేకు ఆనుకుని ఉన్న 400 ఎకరాల కండి షనల్​అసైన్డ్​ భూముల్లో లబ్ధిదారులు జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకోవచ్చు తప్ప అమ్మడం, కొనడం నేరం. కానీ రియల్టర్ లు, వాళ్ల వెనుకున్న లీడర్లు ఆఫీసర్లను మచ్చిక చేసుకొని కథ నడిపించారు. ప్రధానంగా181 సర్వే నంబర్ తో పాటు 56, 131/13, 83, 73/9, 169/ 3, 75/ఎ, తదితర సర్వే నెంబర్లలోని దాదాపు 400 ఎకరాలకుపైగా అసైన్డ్​ భూములకు ఎన్​వోసీలు తెచ్చుకున్నారు. వీటిని చూపి, అన్ని భూముల్లోనూ వెంచర్లు స్టార్ట్​ చేసి ప్లాట్ లు గా మార్చి క్రయ విక్రయాలు జరుపుతున్నారు.1958 కంటే ముందు అసైన్డ్​ అయిన భూములకు మాత్రమే క్రయ విక్రయాలకు చాన్స్​ ఉంటుంది. ఇవి ఆ తర్వాత అసైన్డ్ ​అయిన భూములు కావడంతో ఎన్​వోసీలు జారీ చేయడం చట్టవిరుద్ధం. అందుకే వీటిలో ఏ వెంచర్ కూ డీటీసీపీ అనుమతుల్లేవు.

తాజా రూల్సు​ పాటిస్తాం

జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ నుంచి వచ్చిన తాజా రూల్సు పాలో అవుతాం. అనుమతుల్లేని భూములకు రిజిస్ట్రేషన్లు చేయం. ఈ కోవకు చెందిన సర్వే నంబర్ల వివరాలను ఆఫీస్ లో డిస్ ప్లే చేయిస్తాం.-రవీందర్, రిజిస్ట్రార్, ఆదిలాబాద్.