
టీఆర్ఎస్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్
ఓటర్లలో వ్యతిరేకత ఉందంటున్న పార్టీ లీడర్లు
ఓటర్ల నమోదుపై ఆసక్తిలేని క్యాడర్
పోటీకే వెనుకాడుతున్న పల్లా, బొంతు
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ లో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ రామచంద్రరావు ల పదవీకాలం కాలం ముగుస్తుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కార్యక్రమం అక్టోబర్ ఫస్ట్ నుంచి మొదలవుతోంది. ఐతే ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమం కోసం కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫీడ్ బ్యాక్ చూసి ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులు,ఉద్యోగులు, టీచర్స్ లో పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని కార్యకర్తలు స్పష్టంగా పెద్ద లీడర్లకు చెబుతున్నారు. దీంతో ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన పార్టీకి ప్రయోజనం ఏమీ ఉండదని భావిస్తున్నారు.
గెలుసుడు కష్టమే
వచ్చే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుసుడు కష్టమేనని టీఆర్ఎస్ లీడర్లల్లనే చర్చ జరుగుతోంది. ఉద్యమ టైమ్ లో ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఆ వెంటనే జరిగిన కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. 2015 లోనూ జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి అతి కష్టం మీద బయటపడ్డారు. హైదరాబాద్,రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి పోటీచేసిన దేవిప్రసాద్ ఓడిపోయారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ టీఆర్ఎస్ లీడర్లే చెబుతున్నారు. ఆ వ్యతిరేకతను తట్టుకొని గెలవటం సాధ్యం కాదని ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు.
పోటీకే భయం
గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ లో పోటీ చేసేందుకే అభ్యర్థులు భయపడుతున్నట్లు టీఆర్ఎస్ ఇంటర్నల్ మీటింగ్స్ లో చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మళ్లీ పోటీ చేసేందుకు సిద్దంగా లేరని, పోటీ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఆయనకు తెలుసని ఎన్నికలు జరిగే జిల్లాలకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే తెలిపారు. ‘‘ పోటీ చేయనని పల్లా స్వయంగా పార్టీ పెద్దలకు చెప్పారు. ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఆ మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సహకరించరు. ఆయనపై వ్యతిరేకత ఉంది ’’ అని ఆ ఎమ్మెల్యే వివరించారు. మండలి ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ గెలవలేదు. ఈ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ను పోటీకి దింపాలని పార్టీ భావిస్తోంది. అయితే ఆయనకు కూడా పోటీ చేయటం ఇష్టం లేదని సమాచారం.
For More News..