కొత్త సినిమాలు ఇప్పుడే వద్దు.. 

కొత్త సినిమాలు ఇప్పుడే వద్దు.. 
  • నిలిచిపోయిన సినిమాలు ముందు పూర్తి చేయండి
  • తెలుగు సినీ పరిశ్రమ కీలక తీర్మానం

హైదరాబాద్: కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షలు సడలించి సినిమా, టీవీ షూటింగులకు తెలుగు ప్రభుత్వాలు అనుమతిస్తే ముందుగా నిలిచిపోయిన సినిమాల షూటింగులు పూర్తి చేయాలని తీర్మానించింది. బాలీవుడ్ కేంద్ర బిందువు ముంబై సహా మహారాష్ట్రలో సినిమా, టీవీ షూటింగులకు అక్కడి ప్రభుత్వం అనుమతిచ్చిన నేపద్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు రేపో మాపో ఆంక్షలు సడలించనున్న నేపధ్యంలో తెలుగు సినిమా పరిశ్రమ కీలక సమావేశం నిర్వహించింది.  
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ మరియు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కలసి ఉమ్మడిగా నిన్న బుధవారం హైదరాబాద్ లోని మండలి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ జాయింట్ మీటింగులో  కరోనా మహమ్మారి కారణంగా ఆగి పోయిన సినిమాల షూటింగ్స్ తిరిగి ప్రారంభించే విషయంపై సుదీర్ఘంగా చర్చించి పలు తీర్మానాలు చేశారు. 
తెలుగు చిత్ర పరిశ్రమ తీర్మానాలు
కరోనా వల్ల గత ఏప్రిల్ నెల నుండి షూటింగ్స్ ఆగిపోయినవి. ఇప్పుడు తిరిగి షూటింగ్ ప్రారంభం అవుతున్నందున ఆర్టిస్టులు గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన చిత్రాలకు ప్రాముఖ్యత ఇస్తూ ఆ షూటింగ్స్ లో పాల్గొనాలని నిర్ణయించారు. 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఎవరైనను ఆగిపోయి ఉన్న చిత్రాలను పూర్తి చేయవలసిందిగా నిర్ణయించ డమైనది. ఆ బ్యాలెన్సు వర్క్ పూర్తి అయిన తదుపరి మాత్రమే కొత్త సినిమాలు చేయాలని నిర్ణయించడమైనది. 
దర్శకులు షెడ్యూల్ కుదించుకోవాలి
దర్శకులు దానికి సంబంధించిన అన్ని విభాగాల వారు కరోనా వలన ఆగిపోయి ఉన్న చిత్రాలకు షెడ్యూల్స్ ని కుదించుకుని తక్కువ రోజులలో నిర్మాణం పూర్తి చేయవలసిందిగా నిర్ణయించ డమైనది. గత 2 1/2 నెలల నుండి షూటింగ్ కోసం అంగీకరించిన తేదీలకు అనుగుణంగా మరల సదరు సినిమా షూటింగ్స్ లకు తేదీలు కేటాయించి బ్యాలెన్స్ గా ఉన్న షూటింగ్ ను పూర్తి చేయాలనీ, ఆ తరువాత ఇతర సినిమా షూటింగులో పాల్గొనాలని నిర్ణయించారు.
వ్యాక్సిన్ తీసుకున్నట్లు డిక్లరేషన్ తీసుకోవాలి 
షూటింగ్ ప్రారంభించే ముందు షూటింగులో పాల్గొనే టీమ్ సభ్యులందరూ..  ప్రొడక్షన్ హౌస్ వారు ఆర్టిస్టులతోపాటు టెక్నీషియన్లు, లైట్ బాయ్స్ అందరూ నుండి వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నిబంధన తప్పక పాటించేలా చూసుకోవాలి.
షూటింగ్స్ కు హాజరై ప్రతి యూనియన్ సభ్యుడు కనీసం ఒక డోస్ వ్యాక్సినేషన్ కచ్చితంగా తీసుకొని ఉండాలి. అలా వ్యాక్సిన్ తీసుకొన్న సభ్యులు మాత్రమే షూటింగ్ కి హాజరయ్యే విధంగా ఉండాలి, ఆ ప్రకారంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తరపున ఒక లేఖ వ్రాయుటకు నిర్ణయించారు. అలాగే ఫెడరేషన్ లోని 24 విభాగాల సభ్యులందరికీ ఇన్సూరెన్సు విదిగా చేయించాలని, ఆ బాధ్యతను ఫెడరేషన్ మరియు ఆయా యూనియన్ వారు తీసుకొవాలని సూచించారు. 
ప్రభుత్వ మార్గదర్శకాలు విధిగా పాటించాలి
కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న మార్గదర్శకాలు (SOPs) విధిగా పాటించాలని నిర్ణయించారు. ఈ సూచనలు అన్నిటిని ప్రొడక్షన్ హౌస్ మేనేజర్స్, ఆర్టిస్ట్ మేనేజర్స్ కి తెలియచేస్తూ వారు ఆయా టెక్నీషియన్లకు మరియు ఆయా ఆర్టిస్టులకు తెలియజేయాల్సిన బాధ్యత తీసుకోవాలని తీర్మానించారు. 
అలాగే ప్రతి ఒక్క టెక్నీషియన్, ఆర్టిస్ట్ వ్యక్తిగతంగాను, వ్యవస్థ పరంగానూ అందరు సామాజిక బాధ్యత తో మెలుగుతూ మరియు  తగు జాగ్రత్తలు తీసుకొంటూ షూటింగులలో పాల్గొనాలని కోరారు. అలాగే ఫిలిం ఇండస్ట్రీ లోని ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా తీసుకోవాలని సూచించారు. 
ఈ తీర్మానాలకు తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ వారు తమ సమ్మతిని తెలియచేశారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది.
ఈ తీర్మానాలకు సబంధించి సలహాలు గాని, ఫిర్యాదులు గాని, ఏమైనా ఉంటే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కు తెలియజేస్తే తగిన చర్యలు తీసుకొని వాటిని అమలు చేయడం జరుగుతుందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ కిషన్ దాస్ నారంగి, గౌరవ కార్యదర్శులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, ఎం  రమేష్ ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.