యాదాద్రి, వెలుగు : ఫేక్ సంఘాలను సృష్టించడంతో పాటు సభ్యులకు తెలియకుండానే లోన్లు తీసుకున్న ఘటనలో ట్విస్ట్చోటు చేసుకుంది. వడ్డీతో సహా డబ్బులు చెల్లించాలని మహిళా సంఘాల్లోని మహిళలకు కెనెరా బ్యాంకు లీగల్ నోటీసులు పంపించింది. దీంతో సభ్యులు మెప్మాను ఆశ్రయించారు.
38 సంఘాల సృష్టి, లోన్లు
యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో సభ్యులు లేకుండా 38 ఫేక్ సంఘాలను సృష్టించిన ఆర్పీలు కెనెరా బ్యాంకులో లోన్లు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరికొన్ని సంఘాల్లో సభ్యుల సంతకాలు తీసుకొని మొత్తంగా రూ. 7.99 కోట్ల లోన్లు తీసుకున్నారు. ఈ ఫేక్ లోన్ల ఉదంతంలో నలుగురు ఆర్పీల పాత్రపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారు జైలుకు సైతం వెళ్లి వచ్చారు. ఈ విషయంలో బ్యాంకు రూల్స్కు విరుద్ధంగా లోన్లు ఇచ్చిందున తమకు సంబంధం లేదని, లోన్లు ఇప్పించిన ఆర్పీల నుంచి వసూలు చేసుకోవాలని మెఫ్మా స్పష్టం చేసింది. దీంతో ఇష్యూ ముగిసిపోయిందని అంతా భావించారు.
300 మందికి లీగల్ నోటీసులు
లోన్లు తీసుకున్నట్టుగా రికార్డుల్లో ఉన్న సంఘాలకు కెనెరా బ్యాంకు, తమ అడ్వోకేట్ ద్వారా లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ విధంగా 30 సంఘాల్లోని 300 మంది మహిళలకు లీగల్ నోటీసులు అందాయి. వడ్డీతో సహా చెల్లించాలని అందులో పేర్కొన్నారు. లేకపోతే ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందని తెలిపారు.
అడిషనల్ కలెక్టర్కు ఫిర్యాదు
లీగల్ నోటీసులు అందుకున్న మహిళలు ఆందోళనతో భువనగిరి పోలీసులను ఆశ్రయించి ఆర్పీలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆర్పీలపై ఎలాంటి ఒత్తిడి తేవొద్దని, తాము పరిశీలిస్తామని చెప్పినట్టు మహిళలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లో మెప్మా ఆఫీసుకు వెళ్లి యాదాద్రి అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావును కలిసి నోటీసులు అందించారు.
నోటీసుల విషయంలో ఆందోళన చెందవద్దని వారికి నచ్చజెప్పారు. లోన్లు ఇవ్వడంలో కెనెరా బ్యాంకు రూల్స్కు విరుద్ధంగా వ్యవహరించిందని, ఆర్పీల నుంచి బ్యాంకు రికవరీ చేసుకోవాల్సిఉంటుందన్నారు. నోటీసుల విషయంలో బ్యాంకర్లతో తాను మాట్లాడుతానని మహిళ సంఘాల సభ్యులకు ఆయన తెలిపారు.
