
కొందరు రూల్స్ పాటించకపోవడం వల్లే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. మర్కజ్ వెళ్లొచ్చిన వాళ్ల నుంచి వారి కుటుంబాలకు, దగ్గరివాళ్లకు కరోనా వస్తోందని చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీలోని తలాబ్ కట్ట ప్రాంతంలో ఒకే కుటుంబంలో 20 మందికి వైరస్ వచ్చిందని, మరో ఆరుగురు 81మందికి వైరస్ అంటించారని తెలిపారు. ఇప్పటికీ కొంతమంది సహకరించడం లేదని.. మర్కజ్ వెళ్లొచ్చినవాళ్లు, వాళ ్లకాంటాక్స్ట్ ఎవరైనా ఉంటే ఇప్పటి కైనా ముందుకొచ్చి టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తిచేశారు. అన్నీ తెలిసి కూడా టెస్టులు చేయించుకోకుండా తప్పించుకుంటున్నారని చెప్పారు. అలాంటి వాళ్లను పోలీస్, హెల్త్ సిబ్బంది గుర్తించి టెస్టులకు పంపిస్తున్నారన్నారు. మలక్ పేట నుంచి గుజరాత్కు వెళ్లొచ్చిన ఇద్దరికి వైరస్ పాజిటివ్ వచ్చిందని, అక్కడక్కడా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని వివరించారు.
మహిళలు, పిల్లలకు ప్రత్యేక వార్డులు
కరోనా బారినపడిన మహిళలు, పిల్లల కోసం గాంధీ హాస్పిటల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నట్టు ఈటల తెలిపారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను 1,500 బెడ్ల దవాఖానాగా తీర్చిదిద్దామని చెప్పారు. ఈ నెల 20న దాన్ని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో 10 లక్షల పీపీఈ కిట్లు, పది లక్షల ఎన్95 మాస్కులు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. డాక్టర్లు, సిబ్బంది అందరికీ అవసరమైన ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. కొందరు నాయకులు కిట్లు, మాస్కులు లేవంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, అది సరికాదని పేర్కొన్నారు.
మరో రెండు ల్యాబ్లలో టెస్టులు
ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, ఐపీఎం, నిమ్స్, ఫీవర్ హాస్పిటళ్లు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ, సీసీఎంబీలలో కరోనా టెస్టులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ ల్యాబ్లలో మ్యాన్ పవర్ పెంచి, టెస్టింగ్ కెపాసిటీని డబుల్ చేయాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ హాస్పిటల్లో, ఫోరెన్సిక్ ల్యాబ్లోనూ 18వ తేదీ నుంచి టెస్టులు ప్రారంభిస్తామని చెప్పారు. మూడు వారాల్లోగా మరో అత్యాధునిక ల్యాబ్ను ప్రారంభిస్తామని చెప్పారు. ఆ ల్యాబ్లో ఏకంగా రోజుకు 5 వేల మందికి టెస్టులు చేయొచ్చని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో పది వేల మందికి టెస్టులు చేశామని, అందులో 700 మందికి వైరస్ పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు.
సోషల్ డిస్టెన్స్ పాటించాలె..
కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేసిన డబ్బులు తీసుకోవడానికి జనం క్యూ కట్టడంతో సోషల్ డిస్టెన్స్ అమలు కావడం లేదని చెప్పారు. బ్యాంకులో వేసిన డబ్బులు వెనక్కి పోవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఇక కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ చేసేందుకు అవసరమైన పర్మిషన్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)కు దరఖాస్తు చేశామని వెల్లడించారు.