- విందు చిందుల్లో మునిగిన అధికారులు
 - మీడియా ప్రవేశంతో పారిపోయిన పలువురు
 - పట్టుబడిన డాక్టర్
 - సమంజసం కాదు అంటున్న ప్రజలు
 
కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. నిత్యవసర వస్తువులకు సంబంధించిన షాపులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చి…మిగతా అన్ని షాపులను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. గుంపులు గుంపులుగా ఒకే దగ్గర ఉంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.అయితే కొందరు అధికారులు మాత్రం అడ్డదారిలో లిక్కర్ ను తెప్పించుకుని ఎంజాయ్ చేశారు.
ఖమ్మం జిల్లా మధిర తహసీల్దార్ సైదులు, ఇద్దరు వీఆర్వోలు, ఈవోఆర్డి రాజారావు, సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డి కలిసి మాటూరు పేట పీహెచ్సీ డాక్టర్ శ్రీనివాస రావు గెస్ట్ హౌస్ లో తప్పతాగి ఎంజాయ్ చేశారు. అది కాస్తా మీడియా ద్వారా బయట పడటంతో… పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావడాన్ని గమనించిన తాసిల్దార్ సైదులు, ఈవో ఆర్ డి రాజారావు, సబ్ జైలర్ ప్రభాకర్ పరారైయ్యారు. డాక్టర్ శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వాహనాలైన ఓ కారు, రెండు బైక్ లు సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
వీరికి మద్యాన్ని ఎక్సైజ్ సీఐ సప్లై చేశారు. బాధ్యత గల అధికారులే ఇలా నిబంధనలు పాటించకుండా వ్యవరించడాన్ని తప్పుపడుతున్నారు స్థానిక ప్రజలు. ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

