- బొగు స్లాస్కీ క్రేటర్ను క్లిక్మనిపించిన ఓహెచ్ఆర్సీ
చంద్రయాన్ 2 ఆర్బిటర్లోని హై రిజల్యూషన్ కెమెరా (ఓహెచ్ఆర్సీ) మరోసారి జాబిల్లి ఫొటోలను తీసింది. సెప్టెంబర్ 5న 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి చందమామను క్లిక్మనిపించింది. దక్షిణ ధ్రువంపై ఉన్న బొగుస్లాస్కీ ఈ క్రేటర్ (జర్మనీ ఆస్ట్రానమర్ అయిన పెలోన్ హెచ్. లుడ్విగ్ వోన్ బొగుస్లాస్కీ పేరునే ఆ ప్రాంతానికి పెట్టారు) ప్రాంతాన్ని ఫొటోల్లో ఒడిసి పట్టింది. ఆ లోయ 14 కిలోమీటర్ల వ్యాసం, 3 కిలోమీటర్ల లోతు ఉంటుంది. ఆ లోయలోని మరో రెండు చిన్న లోయలు, అక్కడ ఉన్న బండరాళ్లనూ క్లియర్గా చూపించింది. ఓహెచ్ఆర్సీ తీసిన ఆ ఫొటోలను ఇస్రో తన వెబ్సైట్, ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాగా, విక్రమ్ ల్యాండింగ్ ఫెయిలవడం వెనక కారణాల గురించి అమెరికా గానీ, నాసా గానీ ఏమీ చేయలేదని ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి విల్బర్ రాస్ అన్నారు. శుక్రవారం బెంగళూరులో ఆయన ఇస్రో చీఫ్ శివన్ను కలిశారు. విక్రమ్ నుంచి కమ్యూనికేషన్ కట్ అయిపోవడం ఇండియా అంతర్గత విషయమన్నారు. ల్యాండర్కు ఏం జరిగిందో తేల్చడం చాలా కష్టమైన పని అన్నారు. విక్రమ్కు ఏమైందో కనిపెట్టే బాధ్యత ఇస్రోదేనని, విక్రమ్ మళ్లీ లైన్లోకి వస్తుందన్న నమ్మకం తనకుందని నాసా జెట్ప్రొపల్షన్ లేబొరేటరీ స్పేస్క్రాఫ్ట్ సిస్టం ఇంజనీరింగ్ మేనేజర్ యాన్ డెవెరాక్స్ అన్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఏర్పాటు చేసిన వరల్డ్ స్పేస్ వీక్లో ఆయన మాట్లాడారు. విక్రమ్తో కనెక్షన్ కట్ అయి నెల గడుస్తున్నా దాని జాడను తెలుసుకోవడానికి ఇస్రో సైంటిస్టులు తీవ్రంగా కృషి చేస్తున్నారని అన్నారు. జాబిల్లిని విక్రమ్ ఎలా, ఎక్కడ ఢీకొట్టిందో తెలియదన్నారు. ఇక, కోల్కతాలోని అమెరికన్ సెంటర్లో స్టూడెంట్లతోనూ ఆమె మాట్లాడారు. ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు అంతరిక్ష పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.