
హైదరాబాద్, వెలుగు: ఓఎంసీ కేసులో దోషులైన గాలి జనార్దన్రెడ్డి, బి.వి.శ్రీనివాసరెడ్డి, వి.డి.రాజగోపాల్, మెఫజ్ అలీఖాన్ల బెయిల్ పిటిషన్లపై హైకోర్టు సోమవారం తీర్పును వాయిదా వేసింది. ఓఎంసీ కేసులో దోషులతోపాటు ఓఎంసీ కంపెనీ దాఖలు చేసిన అప్పీళ్లను విచారణకు స్వీకరించి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది. దీనికి సంబంధించిన రికార్డులను కింది కోర్టు నుంచి తెప్పించాలంటూ రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ మే 6న సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ దోషులు దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ల తరఫున పలువురు సీనియర్ న్యాయవాదులు వాదిస్తూ.. సీబీఐ కోర్టు విధించిన ఏడేండ్ల శిక్షలో సగానికిపైగా అనుభవించారన్నారు. అందువల్ల బెయిల్ మంజూరు చేయవచ్చన్నారు. గాలి జనార్దన్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారని, ఇప్పటికే ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేశారని, ప్రస్తుతం దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు విధించిన శిక్షను నిలిపివేయకపోతే ఎన్నిక నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున అసెంబ్లీలో వాదనలు వినిపించే హక్కు ప్రజాప్రతినిధిగా ఉందని, శిక్షను నిలిపివేయకపోతే హక్కుకు భంగం కలుగుతుందన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది శ్రీనివాస్ కపాటియా వాదిస్తూ..బెయిల్ కు సంబంధించి నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలిపెడుతున్నామన్నారు.
అయితే దోషులుగా నిర్ధారిస్తూ కోర్టు విధించిన ఉత్తర్వులను (కన్విక్షన్)ను సస్పెండ్ చేయాలన్న అభ్యర్థనపై అభ్యంతరం ఉందన్నారు. ఈ పిటిషన్లలో కౌంటరు దాఖలు చేస్తామన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను విచారణకు స్వీకరిస్తూ.. విచారణను అగస్టు 11కు వాయిదా వేశారు. గాలి జనార్దన్రెడ్డి, ఓఎంసీ కంపెనీల పిటిషన్లపై విచారణను మంగళవారం చేపడతామన్నారు. ఓఎంసీ కేసులో 6వ నిందితురాలైన ఐఏఎస్ అధికారి వై.శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు నిర్దేశించిన గడువులోగా తేల్చేస్తామని సోమవారం హైకోర్టు వెల్లడించింది.