కేసు వాపస్ తీసుకోవాలంటూ బెదిరింపులు
జవహర్ నగర్, వెలుగు: జవహర్ నగర్ 21 వ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ జక్కుల భాస్కర్ ఓ మహిళను బూతులు తిడుతూ ఆమెపై దాడి చేశాడు. బాధిత మహిళ బట్టలు చిరిగేలా కొడుతూ బెదిరించాడు. గజ్వెల్లి ఇందుమతి (34) తన ఇద్దరు పిల్లలతో కలిసి జవహర్నగర్ పరిధిలోని ప్రగతి నగర్లో ఉంటోంది. శనివారం సాయంత్రం కాలనీకి చెందిన బాలాజీ, రమణ గొడవ పడ్డారు. వారితో మాట్లాడిన 21 వ డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ జక్కుల భాస్కర్ కాంప్రమైజ్ చేశాడు. మరుసటి రోజు ఇందుమతి ఈ విషయం గురించి రమణతో మాట్లాడుతోంది. అదే సమయంలో అక్కడికి తన భార్యతో కలిసి వచ్చిన జక్కుల భాస్కర్ ఒక్కసారిగా ఇందుమతిని బూతులు తిట్టటం మొదలు పెట్టాడు. భార్య కవిత తో కలిసి దాడి చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు కంప్లయింట్ చేసింది. నా మీదే కేసు పెడతావా? అంటూ జక్కుల భాస్కర్ బాధితురాలిపై బెదిరింపులకు దిగాడు. వెంటనే కేసు వాపస్ తీసుకోకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు సోమవారం మీడియాను ఆశ్రయించింది. తనకు ప్రాణ హాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలు ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు జక్కుల భాస్కర్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.