మోడీ 2.0కి ఏడాది.. ప్రజలకు ఓపెన్‌ లెటర్‌‌

మోడీ 2.0కి ఏడాది.. ప్రజలకు ఓపెన్‌ లెటర్‌‌
  • వలస దుస్థితిపై ఆవేదన
  • మన ఐకమత్యమే మనల్ని కాపాడింది
  • ప్రపంచం మొత్తం ఇటు చూసేలా చేసింది

న్యూఢిల్లీ: 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చి శనివారానికి ఏడాది పూర్తైంది. ప్రధానిగా మోడీ 2.0 ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జాతి ప్రజలను ఉద్దేశించి ఓపెన్‌ లెటర్‌‌ రాశారు. ఇండియాను ‘గ్లోబల్‌ లీడర్‌‌’గా మార్చాలన్న కలను సాకారం చేసే దిశగా ఈ ఏడాది పాలన సాగిందని ఆయన అన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో ఏడాది పూర్తి చేసుకున్నానని, గతేడాది ఇదే రోజు ఇండియా డెమోక్రసీలో సువర్ణ​అధ్యాయం ప్రారంభమైంది అని చెప్పారు. విజయాన్ని అందించిన 130 కోట్ల మందికి నమస్కరిస్తున్నాను అని మోడీ అన్నారు. “ సాధారణంగా అయితే మీ మధ్యలో ఉండేవాడ్ని. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ లెటర్‌‌ ద్వారా మీ ఆశిస్సులు కోరుతున్నాను. మీ ఆప్యాయత, సద్భావన, క్రియాశీల సహకారం కొత్త శక్తిని, ప్రేరణను ఇచ్చాయి” అని అన్నారు. మోడీ లెటర్‌‌ సారాంశం ఆయన మాటల్లోనే

ఏళ్లనాటి సమస్యలకు పరిష్కరం

దేశంలో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలను తీర్చాం. జమ్మూకాశ్మీర్‌‌లో ఆర్టికల్‌ 370 రద్దు ప్రజల్లో ఏకత్వాన్ని, దేశ సమగ్రతను చాటింది. కొన్ని ఏళ్లుగా పరిష్కరాం కాని అయోధ్య రామమందిరం వివాదం తన పాలనాకాంలోనే సద్దుమణగడం ఆనందాన్ని కలిగించింది. ముస్లిం మహిళల గౌర ప్రతిష్ఠలను కాపాడేందుకు ముమ్మారు తల్లాక్‌ సంప్రదాయాన్ని చెత్తబుట్టలో వేశాం. పౌరసత్వ సవరణ చట్టం భారతదేశ దయాగుణాన్ని తెలియజేస్తుంది. త్రిదళాధిపతి నియామకం సైన్యంలో సమన్వయాన్ని పెంచింది. పేదలు, రైతులు, మహిళలు అన్ని వర్గాలకు మేలు చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. రైతులకు పెట్టబడి సాయం అందించేందుకు ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ అందరు రైతులకు వర్తింపజేశాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.72000 కోట్లు రైతుల అకౌంట్లలో వేశాం. జల్‌జీవన్‌ మిషన్‌ద్వారా 15 కోట్ల కుటుంబాలకు తాగునీరు అందిస్తాం అని హామీ ఇస్తున్నాం. ‘గగన్‌యాన్‌’ ప్రాజెక్టు దిశగా చర్యల్ని వేగవంతం చేశాం. చిన్నవ్యాపారులు, వ్యవసాయ కూలీల్లో 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.32వేలు పింఛను ఇచ్చేందుకు సిద్ధమయ్యాం. ఫిషర్‌‌మెన్‌ కోసం సపరేట్‌ డిపార్ట్‌మెంట్‌ ఏర్పాటు చేశాం. బ్లూ ఎకానమీని బూస్టప్‌ చేసేందుకు చర్యలు తీసుకున్నాం. వ్యాపారుల సమస్యలను తీర్చేందుకు ‘వ్యాపారి కల్యాణ్‌ బోర్డు’ ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతాల్లోని పిల్లల కోసం 400 ‘ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు” ప్రారంభించాం. మహిళలకు రుణ సదుపాయం కల్పించాం. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఉన్న డిఫరెన్సెస్‌ తగ్గిపోతున్నాయి.

కరోనా వైరస్‌ వల్ల కూలీలు ఇబ్బందులు పడ్డారు

కరోనా మహమ్మారి మన దేశాన్ని ముంచెత్తింది. కరోనా మన దేశంలోకి వచ్చినప్పుడు.. ఇండియా ప్రపంచానికే సమస్యగా మారుతుందని చాలా భయపడ్డారు. కానీ ఇప్పుడు మనం తీసుకున్న చర్యలు వల్ల ప్రపంచమే మనవైపు చూస్తోంది. ప్రపంచంలోని శక్తిమంతమైన, సంపన్న దేశాలతో పోలిస్తే మన దేశంలోని సామూహిక బలం, సామర్థ్యం అసమానమైనవని మీరు నిరూపించారు. కరోనా వారియర్స్‌ కోసం చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం, జనతాకర్ఫ్యూ, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించడం ద్వారా ఏక్‌ భారత్‌ శ్రేష్ట భారత్‌ అని నిరూపించారు. ఈ సంక్షోభంలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేల సంఖ్యలో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. వలస కూలీలు స్వస్థలాలకు చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. వ్యాపారులు, కూలీలు, హాకర్లు, హస్తకళాకారులు ఈ సంక్షోభంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ బాధలు అసౌకర్యాలు, విపత్తులుగా మారకుండా చూసుకుందాం. అంపన్‌ తుపాను పశ్చిమబెంగాల్‌, ఒడిశాలను నాశనం చేసింది. కానీ అక్కడి ప్రజలు ధైర్యంతో ఉన్నారు. వారి ధైర్యం దేశ ప్రజలందరికీ స్ఫూర్తి నిచ్చింది.

చేయాల్సింది చాలా ఉంది

ఈ ఆరేళ్ల జర్నీలో మీరంతా నాపైన ఎంతో ప్రేమను చూపించి నన్ను ఆశీర్వదించారు. అదే నన్ను చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపించింది. ఇంకా చేయాల్సింది చాలా ఉందని నాకు తెలుసు. దేశం ఎన్నో సవాళ్లు, సమస్యలను ఎదుర్కోంటోంది. వాటిని ఎదుర్కొనేందుకు రాత్రి పగలు పనిచేస్తున్నాను. నాలో లోపాలు ఉండొచ్చు. కానీ దేశానికి కాదు. స్టే హెల్తీ, స్టే సేఫ్‌, స్టే అవేర్‌‌, స్టే ఇన్‌ఫార్మ్డ్‌, మీ ప్రధాన్‌ సేవక్‌ నరేంద్రమోడీ. అంటూ లెటర్‌‌ను ముగించారు.