హోల్ సేల్ ధర రూ.200
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉల్లి ప్రకంపనలు సృష్టిస్తోంది. శుక్రవారం హైదరాబాద్లోని మలక్ పేట్ గంజ్ హోల్సేల్ మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో ఉల్లి రూ.200 ధర పలికి ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. మహారాష్ట్ర నుంచి 20 లారీల్లో 3000 క్వింటాళ్లు వచ్చిన ఉల్లిలోడ్ను ఒక్కరోజులోనే మార్కెట్లో విక్రయించారు. ఇందులో పెద్ద సైజు పాత ఉల్లి ధర క్వింటాలుకు రూ.20 వేలు పలికింది. మిగతా వాటికి క్వింటాలుకు రూ.17 వేలు హోల్ సేల్ ధర పలికింది. హోల్సేల్ మార్కెట్లో ఇంతగా ధర పలకడం ఎప్పుడూ చూడలేదని మార్కెటింగ్ వర్గాలు చెప్తున్నాయి. 30 రోజుల్లో రూ. 3,500 నుం చి 20,000 పెరిగింది. కిందటి నెల ప్రారంభంలో క్వింటాల్ ఉల్లి ధర రూ.3,500 ఉంటే నెలాఖరు నాటికి రెండున్నర రెట్లు పెరిగి రూ.9,000 కు చేరుకుంది. ఇది జరిగి వారం గడువకముందే ప్రస్తుతం క్విటాల్ కు రూ.20 వేలకు చేరుకుంది. మలక్ పేట్ మార్కెట్కు రోజుకు 120 నుంచి 150 లారీల్లో దిగుమతి అయ్యే ఉల్లి.. 15 రోజుల కింద 70 నుంచి 100 లారీల లోడ్కు తగ్గింది. శుక్రవారం కేవలం 20 లారీల లోడ్ మాత్రేమే వచ్చిందని, అంటే ఉల్లికి ఎంతటి డిమాండ్ పెరిగిందో గమనించవచ్చని వ్యాపారులు అంటున్నారు.
60 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గింది
ఏటా మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ లో ఉల్లి మూడు పంటలు పండుతుంది. అయితే పంటను మూడ్నెళ్లకు మించి నిల్వ చేసుకునే పరిస్థి తి లేకపోవడంతో 3 పంటలు పండినా ప్రతి మూన్నెళ్లకోసారి సాధారణంగా కొరత ఉండేది. ఈ సారి ఖరీఫ్లో పంట పూర్తిగా దెబ్బతినడంతో దిగుబడి తగ్గిపోయింది. కొత్త పంట వచ్చే వరకు పాత స్టాక్ వాడుకోవాల్సిందేనని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. దేశంలో ఏటా 160 లక్షల టన్నుల ఉల్లి వినియోగం అవుతుండగా.. ఉత్పత్తి 230 లక్షల టన్నులుగా ఉంది. వానాకాలం పంట దెబ్బతినడంతో ఇందు లో 60 లక్షల టన్నుల ఉల్లి ఉత్పత్తి తగ్గిపోయింది.
దిగుమతిపై దృష్టి లేకే..
ఏటా ఉల్లి కొరతను అదిగమించేందు కు మనదేశం ఈజిప్ట్, ఇరాన్ , ఆఫ్ఘా నిస్తాన్ నుంచి ఉల్లి దిగుమతి చేసుకుంటుంది. ఈసారి దిగుమతి చేసుకోవాల్సి ఉన్నా జరగలేదని, అందుకే సమస్య ఎదుర్కోవాల్సి వస్తోందని ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. రాష్ట్రంలో 38,940 ఎకరాలలో ఉల్లి సాగవుతుండగా ఏటా 4,02,373 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోంది. అది మన రాష్ట్ర అవసరాలకు సరిపోనందున మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్నాటక, ఏపీల మీదనే డిపెండ్ కావాల్సి వస్తోంది. ఒక్క మలక్ పేట్ గంజ్ మార్కెట్లోనే ఏటా 30 వేల టన్నుల ఉల్లి దిగుమతి అవుతూ వ్యాపారం రూ.150కోట్ల నుంచి రూ.500కోట్లకు పైగా జరుగుతోంది. మరోవైపు ఈజిప్టు నుంచి రావాల్సిన 6,060 టన్నుల ఉల్లి దిగుమతీ ఆలస్యం అవుతోంది. అందులో రాష్ట్రా నికి 500 టన్నులు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. ఆ స్టాక్ వస్తేనయినా కొంతమేర ఉల్లి ధరలు తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.