వారంలో రెండోసారి అంతరాయం
గంటల తరబడి వెయిట్
చేసి వెళ్తున్న వాహనదారులు
ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం
కొనసాగుతున్న బీఎస్ -4 వెహికల్స్ రిజిస్ట్రేషన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆర్టీఏ ఆన్లైన్ సర్వీస్ మరోసారి ఆగిపోయింది. బీఎస్–4 రిజిస్ట్రేషన్లు మినహా మిగతా ఏ సర్వీసులూ పనిచేయడం లేదు. గత వారం కూడా ఇలాంటి ఇబ్బందే తలెత్తింది. దీంతో ఆర్టీఏ ఆఫీస్లకు వచ్చిన వాహనదారులు గంటల తరబడి వెయిట్ చేసి పనికాకుండానే వెళ్లిపోతున్నారు.
నిలిచిన సర్వీస్లు ఇవే..
రాష్ట్రంలో 74 ఆర్టీఏ ఆఫీస్ల ద్వారా ఆన్లైన్ సర్వీస్లను అందిస్తున్నారు. వీటిలో లెర్నింగ్, పర్మినెంట్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకునే వారే ఎక్కువ ఉంటారు. రెండు రోజులుగా లెర్నింగ్ లైసెన్స్, పర్మినెంట్ లైసెన్స్, లైసెన్స్ రెన్యూవల్, పర్మిట్లు, ఎన్వోసీ తదితర సేవలు నిలిచిపోయాయి. సాధారణంగా ప్రతి ఆర్టీఏ ఆఫీస్లో రోజుకు 300–400 వరకు లెర్నింగ్ లైసెన్స్, 100 వరకు లైసెన్స్ రెన్యూవల్, 50 వరకు పర్మిట్ల సేవలు కొనసాగుతాయి.
కేవలం బీఎస్-4 వెహికల్సే రిజిస్ట్రేషన్
మిగతా సేవలు నిలిచిపోయినా బీఎస్ –4 వెహికల్స్ రిజిస్ట్రేషన్లు మాత్రం కొనసాగుతున్నాయి. బీఎస్ – 4 బండ్ల రిజిస్ట్రేషన్లు అధికంగా ఉన్నాయని, అందుకే మిగతా సేవలకు ఇబ్బంది ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. గతంలో రోజుకు 3 వేల వరకు సాధారణ రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ప్రస్తుతం 4 వేల వరకు అవుతున్నాయి. వెహికల్స్ రిజిస్ట్రేషన్లపై 12శాతం ట్యాక్స్ వస్తోందని, అందుకే వాటిని ప్రోత్సహిస్తూ మిగతా సేవల్ని పక్కనపెట్టేశారనే ఆరోపణలున్నాయి.
వాహనదారుల ఫైర్
వివిధ పనుల కోసం ఆర్టీఏ ఆఫీస్లకు వస్తున్న వారు సేవలు పొందకుండానే గంటల తరబడి క్యూలో నిలబడి వెనక్కి వెళ్తున్నారు. స్లాట్ బుకింగ్ చేసుకుని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా ఆన్లైన్ పనిచేయడంలేదని తెలిసి నిరుత్సాహానికి గురవుతున్నారు. స్లాట్ బుక్ చేసుకుని ఆఫీస్లో లీవ్ పెట్టి వస్తే వృథా అయిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందే సమాచారం ఇస్తే బాగుండేదని అంటున్నారు.
సమాచారం ఇస్తలేరు
ఆర్టీఏ ఆన్లైన్ సర్వీస్ ఆపేశారు. వివిధ పనుల కోసం వచ్చేటోళ్లు ఇబ్బంది పడుతున్నరు. మాకేం తెల్వదని అధికారులు చెబుతున్నారు. కనీస సమాచారం చెప్తలేరు. ఇలా ఇబ్బంది పెట్టడం ఫస్ట్ టైం కాదు.. గతంలోనూ ఇలాగే చేశారు.
– దయానంద్, ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రధాన కార్యదర్శి
రీషెడ్యూల్ చేస్తున్నం
ప్రస్తుతం అవసరం ఉన్న వారికే సేవలు అందిస్తున్నం. స్లాట్ బుక్ చేసుకున్న వారికి రీషెడ్యూల్ చేస్తున్నం. కరోనా నేపథ్యంలో జనాలు ఎక్కువగా గుమికూడకుండా చూస్తున్నం. వాహనదారులకు ఇబ్బందుల్లేకుండా చూస్తున్నం. – ఎంఆర్ఎం రావు, రవాణా కమిషనర్