అయ్యప్పా.. నీ దర్శనమెట్లా!

అయ్యప్పా.. నీ దర్శనమెట్లా!

ఆన్​లైన్​లో టికెట్లు దొరుకుతలేవ్​

ఆందోళనలో భక్తులు
దీక్షకు కరోనా ఎఫెక్ట్
ఈ ఏడాది 80 శాతం మంది సామి మాలకు దూరం
ట్రావెల్స్‌కి  బిజినెస్ డల్

హైదరాబాద్, వెలుగు: అయ్యప్ప స్వామి దీక్షపై కరోనా ఎఫెక్ట్​ పడింది.  ఏటా లక్షలాది మంది ధరించే  అయ్యప్ప మాలకు కరోనా కారణంగా  80 శాతం మంది భక్తులు దూరమయ్యారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వారిలోనూ దర్శనం ఎలా అన్న ఆందోళన మొదలైంది. మాల ధరించిన ప్రతి భక్తుడు మండల దీక్ష చేసి శబరిమలలో కొలువు దీరిన అయ్యప్పస్వామి  దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి కోవిడ్  కారణంగా శబరిమలలో దర్శనానికి కేరళ ప్రభుత్వం చాలా రూల్స్ పెట్టింది. 60 ఏళ్ల పైబడిన వారు,10 ఏళ్ల లోపు వారు రావొద్దని ప్రకటించడంతో పాటు రోజుకు రెండు వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తోంది.  వీకెండ్​ రెండు రోజుల్లో మూడు వేల మందిని అనుమతించింది. ఈ టికెట్లను కూడా ఆన్​లైన్​ ద్వారా మాత్రమే శబరిమల అఫిషియల్​ వెబ్​సైట్ లో అందుబాటులో ఉంచింది. ఆన్ లైన్​ లో టికెట్లు దొరక్క పోవడంతో చాలా మంది అయ్యప్పమాల వేయలేదు. వచ్చే ఏడాది జనవరి 20 న శబరిమలలో టెంపుల్​ క్లోజ్​ కానుంది. అప్పటి వరకు కూడా టికెట్లు అందుబాటులో లేవు. దీంతో ఈ సారి శబరిమల యాత్రను పోస్ట్​ పోన్ చేసుకుంటున్నట్లు కొందరు భక్తులు చెప్తున్నారు. స్లాట్​ బుక్ చేసుకోకుండా మాల ధరించిన వారు  టికెట్ల కోసం వెబ్​ సైట్​లో చూస్తున్నారు. ఇక అయ్యప్ప మాల ధరించే వారి సంఖ్య తగ్గడంతో ఆ ప్రభావం చాలా రంగాలపై పడింది.

ఏటా 40 లక్షల మంది

ఏటా ఒక్క తెలంగాణ నుంచే దాదాపు 40 లక్షల మంది శబరిమల యాత్ర చేస్తారు. ఇందులో అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు 20 లక్షలకు పైగానే ఉంటారు. వీరిలో   10 లక్షల మంది రైళ్లు,ఫ్లైట్స్, సొంత వాహనాల్లో వెళ్తారు. మిగతా వారందరూ ట్రావెల్స్​ల్లోనే శబరిమల వెళ్తారు.  అయ్యప్ప సీజన్​లో అందుకు అనుగుణంగానే ట్రావెల్స్​ నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక్కో ట్రావెల్స్​ నుంచి ఒక వెహికల్​ ఈ సీజన్​లో కనీసం 3, 4 సార్లు కేరళ ని విజిట్ చేస్తాయి. ఈ సారి శబరిమల కి  బుకింగ్స్ రావటం లేదని ట్రావెల్స్​ నిర్వాహకులు చెప్తున్నారు. లాక్​ డౌన్ ​టైమ్ లో వచ్చిన నష్టాలు ఇప్పుడు కొంచెం తీరుతాయనుకుంటే అసలు బిజినెసే​ లేదంటున్నారు.  నవంబర్, డిసెంబర్, జనవరి మొదటి రెండు వారాలు కేరళ టూర్​ లో బిజీగా ఉండే ట్రావెల్స్​ కి ఈ సారి 90 శాతం బిజినెస్​ తగ్గిందంటున్నారు.

పడి పూజలు తక్కువే

అయ్యప్పపడి పూజలు కూడా పెద్దగా జరగకపోవడంతో పూజ సామాగ్రి షాపుల్లో బిజినెస్ తగ్గింది. సికింద్రాబాద్, కోఠి, బేగంబజార్​ లాంటి పెద్ద మార్కెట్లు వెలవెలబోతున్నాయి. గతంలో లక్షల్లో ఉండే బిజినెస్ ఇప్పుడు వేలల్లో కూడా  వ్యాపారులు చెప్తున్నరు. అయ్యప్ప పూజలు చేసేవారికి కూడా ఆర్డర్లు తగ్గాయి. అన్నదాన కార్యక్రమాలు, నిత్య పూజాలు, భజనమండలి ఇలా అందరికీ ఈ ఏడాది 80 శాతం బిజినెస్ తగ్గింది.

స్పెషల్ ట్రైన్స్ లేవు

సాధారణంగా అయ్యప్ప సీజన్ లో స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతుంటుంది సౌత్ సెంట్రల్ రైల్వే. కానీ ఈసారి ఆ అవసరమే రావటం లేదు. ఉన్న కొన్ని రైళ్లలో కూడా సీట్లు ఈజీగానే దొరుకుతున్నాయి. కానీ   దర్శనం కోసం శబరిమలకు  వెళ్లే భక్తులు స్లాట్​ బుక్​ చేసుకున్న టికెట్​ని చూపిస్తేనే కేరళ పోలీసులు అనుమతి ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్​ లేకుండా దర్శనానికి ఎవరు రావొద్దని కేరళ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఎంతో మందికి ఇప్పటికీ దర్శనం టికెట్లు బుక్ కాలేదు. జనవరి రెండో వారం నాటికి టికెట్లు దొరకకపోతాయా అన్న ధీమాతో చాలా మంది అయ్యప్ప మాల వేశారు. కానీ వచ్చే నెల 20 నాటికి కూడా టికెట్లు అందుబాటులో లేవు. దీంతో  స్వామి దర్శనం కోసం అని మాల వేసిన భక్తులు ఆందోళన చెందుతున్నరు. స్లాట్ బుక్ కాకపోతే ఇక్కడి టెంపుల్స్ లోనే ఇరుముడి సమర్పించాలని భావిస్తున్నారు. బీహెచ్ఈఎల్, మెట్టుగూడ, సనత్ నగర్. సోమాజిగూడ, బొల్లారం, జీడిమెట్ల ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప టెంపుల్స్ లోనే ఈసారి వేలాది మంది అయ్యప్ప భక్తులు దీక్ష విరమించనున్నరు.

ఈ సారి మాల వేసుకోలేదు

శబరి దర్శనం టికెట్లు అందుబాటులో లేవు. ఒక వేళ మాల ధరించాక టికెట్లు లభించకపోతే ఇబ్బంది అవుతుందని ఈ సారికి పోస్ట్​ పోన్​ చేసుకున్న. నేను 26 ఏళ్లుగా మాల వేస్తున్నాను. కానీ ఈ సారి కరోనా కారణంగా వేయలేకపోయాను. నాతో పాటు 15 మంది మాల ధరించే వాళ్లం. ఇప్పుడు ఎవరూ దీక్ష తీసుకోలే.

‑ ధరమ్ కార్​ సురేష్​, హిమాయత్ సాగర్​

ట్రావెల్స్​ బిజినెస్​ లేదు…

ఈ రెండు నెలల్లో ఒక్కో వెహికల్​ కనీసం మూడు, నాలుగు సార్లు శబరిమల టూర్​ కి వెళ్లేది. కానీ ఈ సారి ఎక్కడి నుంచి బుకింగ్​లు వస్తలేవు. లాక్​ డౌన్​ నుంచి ట్రావెల్స్​ బిజినెస్​ డీలానే ఉంది. ఇప్పుడు కేరళ టూర్ ఆర్డర్స్​ వస్తాయనుకుంటే రావడంలేదు. టికెట్ల సంఖ్యను పెంచితే కొన్ని ఆర్డర్లు వస్తాయనిపిస్తుంది.

‑ సూర్యనారాయణ, నారాయణ ట్రావెల్స్​ నిర్వహకుడు, హైదరాబాద్​

టికెట్స్ కోసం వెయిటింగ్
ఎక్కువ మంది భక్తులకు శబరిమల అయ్యప్ప దర్శనం కల్పించేందుకు కేరళ ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రతిసారి మాల ధరించి కేరళకు తప్పనిసరి
వెళ్తాను. 25వ సారి మాల ధరించాను. స్లాట్ బుకింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. టికెట్లు దొరుకుతాయని భావిస్తున్నాం.
‑ యు. రవీందర్, గురుస్వామి

For More News..

విదేశాలను మించిన జాబ్ ఆఫర్స్ ఇక్కడే

కొత్త సబ్‌‌స్క్రయిబర్ల కోసం ఓటీటీ ప్లాన్స్​