కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి: మంత్రి శ్రీ రాములు

కరోనా నుంచి దేవుడే మనల్ని కాపాడాలి: మంత్రి శ్రీ రాములు

దేశ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అందరూ ధైర్యం చెబుతూ ప్రజలు ఆందోళనకు గురికాకుండా చూస్తున్నారు. వైరస్ ను ఎదుర్కోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే.. తాజాగా కర్ణాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దేవుడు మాత్రమే మనల్ని రక్షించాలి అంటూ ఆయన అన్న మాటలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి.

శ్రీరాములు చేసిన వ్యాఖ్యలు బీజేపీలో కూడా అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి. కరోనా కేసులు అమాంతం పెరుగుతున్నాయని… మహమ్మారికి పేద, ధనిక, కులం, మతం లేదని ఆయన చెప్పారు. దీనికి స్థాయి, అంతస్తు అనే తేడా లేదని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజుల వ్యవధిలోనే డబుల్ అవుతున్నాయనితెలిపారు. కేవలం భగవంతుడు మాత్రమే మనల్ని కాపాడగలడని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది. కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని  ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీరాములు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందంటున్నారు.