- రుగుతున్న లైఫ్స్టైల్ జబ్బులు
- దేశవ్యాప్తంగా 30 ఏళ్లలో 22% పెరిగిన ఎన్సీడీ కేసులు
- 1990లో 37.9 శాతం.. 2016లో 61.8%
- పట్టిపీడిస్తున్న బీపీ, షుగర్, కేన్సర్, గుండె జబ్బులు
- లైఫ్స్టైల్, తిండి అలవాట్లే ప్రధాన కారణం
- తగ్గిపోతున్న అంటు వ్యాధులు
- 53.6 నుంచి 27.5 శాతానికి తగ్గుదల
హైదరాబాద్, వెలుగు:
టైంకు తినకపోవడం, జంక్ఫుడ్, గాలి కాలుష్యం, పంటల్లో పురుగుమందుల వాడకం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, పని ఒత్తిడి.. కారణాలేవైతేనేం జనాన్ని లైఫ్స్టైల్ జబ్బులు వేధిస్తున్నాయి. షుగర్, బీపీ, కేన్సర్, పక్షవాతం, కిడ్నీ, గుండె జబ్బుల వంటి నాన్ కమ్యూనికెబుల్ డిసీజెస్ (ఎన్సీడీ– ఒకరి నుంచి మరొకరికి వ్యాపించనివి) పట్టి పీడిస్తున్నాయి. అటు ఆరోగ్యానికి ఇటు జేబుకు చిల్లు పెడుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 30 మంది ఏదో ఒక ఎన్సీడీతో బాధపడుతున్నారు. వందలో 18 మందిని బీపీ, షుగర్ బాధిస్తున్నాయి. ఎన్సీడీ స్క్రీనింగ్ టెస్టుల్లో ఈ విషయం తేట తెల్లమవుతోంది. రాష్ట్రంలో 30 ఏండ్ల నుంచి 65 ఏండ్ల లోపు వాళ్లు కోటి 37 లక్షల 17 వేల 186 మంది ఉన్నారు. 95 లక్షల 54 వేల 234 మందికి ఎన్సీడీ స్క్రీనింగ్ టెస్టులు చేశారు. వాళ్లలో 7 లక్షల 5 వేల 232 మందికి హైబీపీ, 3 లక్షల 77 వేల 823 మందికి షుగర్ ఉన్నట్టు గుర్తించారు. మరో 6 లక్షల మందికి బీపీ, షుగర్ రెండూ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. వాళ్లకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేయిస్తున్నారు. అనుమానిత కేసుల్లో ప్రతి వంద మందిలో 99 మందికి బీపీ లేదా షుగర్ టెస్టులు పాజిటివ్గా వస్తున్నాయి. ఈ లెక్కన రాష్ర్టంలో ప్రతి వందలో 18 మంది షుగర్ లేదా బీపీతో బాధపడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో కిడ్నీ, హార్ట్ఎటాక్, స్ట్రోక్, సీవోపీడీ, కేన్సర్ బాధితుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఆరోగ్యశ్రీలో అత్యధికంగా గుండె, కిడ్నీ జబ్బుల కోసమే ఖర్చు చేస్తున్నారు. గతేడాది ఏకంగా 13,130 మంది కామన్ (నోటి, గర్భాశయ కేన్సర్, రొమ్ము) కేన్సర్ల బారిన పడ్డారు. కేంద్ర ఆరోగ్య శాఖ నేషనల్ హెల్త్ మిషన్ కామన్ రివ్యూ ప్రోగ్రామ్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దేశంలో 22 శాతం పెరిగినయ్
దేశవ్యాప్తంగా 30 ఏళ్లలో ఎన్సీడీ కేసులు22 శాతం పెరిగాయి. 1990లో 37.9 శాతం కేసులుంటే 2016 నాటికి 61.8 శాతానికి చేరాయి. ఈ నాలుగేళ్లలో అది మరింత పెరిగిందని, ఇప్పటి జబ్బుల్లో 65 నుంచి 70 శాతం అవే ఉంటాయని డాక్టర్లు చెబుతున్నారు. 2018లో చేసిన ఎన్సీడీ స్ర్కీనింగ్లోనూ ఈ అంశం స్పష్టమైంది. దేశవ్యాప్తంగా (ఢిల్లీ, లక్షద్వీప్ మినహా) 6 కోట్ల 51 లక్షల 94 వేల 599 మందికి టెస్టులు చేస్తే 31 లక్షల 02 వేల186 మందికి షుగర్, 40 లక్షల 38 వేల 66 మందికి బీపీ, 11 లక్షల 06 వేల 360 మందికి షుగర్–బీపీ, లక్షా 68 వేల122 మందికి కేన్సర్, 69,413 మందికి స్ర్టోక్, లక్షా 98 వేల 753 మందికి గుండె జబ్బులున్నట్టు తేలింది. దానికి భిన్నంగా 20వ శతాబ్దంలో కొన్ని లక్షల మందిని పొట్టనబెట్టుకున్న అంటు వ్యాధులు ఇప్పుడు బాగా తగ్గిపోయాయి. 1990 నాటికి అంటు వ్యాధి కేసులు 53.6% ఉండగా, 2016 నాటికి అవి 27.5 శాతానికి తగ్గాయి.
లెక్కలకే పరిమితం
ఎన్సీడీపై కేంద్రం దేశవ్యాప్తంగా సర్వే చేయిస్తోంది. కోట్ల మందికి ఆ జబ్బులు ఉన్నాయని ఇప్పటికే కొన్ని టెస్టుల్లో తేలింది. రోగుల సంఖ్య పెరుగుతుండడంతో జిల్లా, సీహెచ్సీల స్థాయిలో ఎన్సీడీ సెంటర్లు పెట్టాలని నిర్ణయించింది. ఈ సెంటర్ల ద్వారానే రోగులందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు. గతంలో కొన్ని సర్వేలు చేసినా, లెక్కల వరకే పరిమితమైంది. ఎంత మందికి దేని వల్ల జబ్బులొస్తున్నాయన్న అంశాన్ని మాత్రం చెప్పలేదు. ప్రతి సర్వేలోనూ లైఫ్స్టైల్లో వచ్చిన మార్పులు, తిండి అలవాట్లే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రోగుల గుర్తింపు, మందుల పంపిణీపైనే దృష్టి పెడుతున్నాయి. ఆ మేరకే పథకాలు రూపొందిస్తున్నాయి. రోగం రాకుండా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్సర్సైజులు చేయాలని చెబుతున్నాయి తప్ప, అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పట్టించుకోవట్లేదు.
చాలా మారాలి
ఎన్సీడీ నుంచి జనాన్ని కాపాడాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మార్పులు రావాలి. హెల్త్ ఎడ్యుకేషన్ను మెరుగు పరచాలి. పార్కుల సంఖ్య పెంచి, లంగ్ స్పేస్ ఇంప్రూవ్ చేయాలి. కాలుష్య నియంత్రణకు, పంటల్లో పురుగుమందుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు అమలు చేయాలి. తిండి, నీళ్లు, పాలు కల్తీ అవకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. నేటి ఆధునిక కాలంలో పర్సనల్ లైఫ్ బాగా తగ్గిపోయింది. 8 గంటల పని రూల్ అమలు కావట్లేదు. పని ఒత్తిడి, టార్గెట్ల వెనక పరిగెత్తడం పెరిగిపోయింది. చాలా మంది యువతకు బీపీ, షుగర్ రావడానికి ఇదే కారణం. అదిది తగ్గాలంటే పని గంటల రూల్ కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. పని వాతావరణం మారాలి. వ్యక్తులుగా ఎవరికివారు తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. తమకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి. వ్యాయమం చేయాలి. జంక్ఫుడ్ అలవాట్లు మార్చుకోవాలి. – డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మాజీ సెక్రటరీ