- అత్యవసరమైన వస్తువులపై చేసే ఖర్చులు కూడా తగ్గినయ్
- యాక్సిస్ మై ఇండియా సర్వేలో వెల్లడి
హైదరాబాద్ : ప్రజలు ఖర్చులు చేయడం గత మూడు నెలల నుంచి తగ్గుతూ వస్తోందని కన్జూమర్ల బిహేవియర్ను ఎనాలసిస్ చేసే యాక్సిస్ మై ఇండియా పేర్కొంది. అత్యవసరమైన వస్తువులతో పాటు అత్యవసరం కాని వస్తువులపై చేసే ఖర్చులు గత మూడు నెలల నుంచి తగ్గుతూ వస్తున్నాయని ఈ సంస్థ తన జులై రిపోర్ట్లో వెల్లడించింది. ప్రతీ నెల ఇండియా కన్జూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ (సీఎస్ఐ) ను విడుదల చేసే ఈ సంస్థ, జులై రిపోర్ట్ కోసం పెట్రోల్, డీజిల్ రేట్లపై ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించింది. అంతేకాకుండా తొందరగా రిటైర్మెంట్ తీసుకోవడంపైన, ఐపీఎల్ మ్యాచ్లపైనా అభిప్రాయాలను సేకరించింది.
వివిధ కేటగిరీల్లో సర్వే..
జనం అత్యవసరమైన, అత్యవసరం కాని ప్రొడక్ట్ల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు, హెల్త్ కేర్ కోసం, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారనే అంశాలను యాక్సిస్ మై ఇండియా పరిగణనలోకి తీసుకొని ఈ సర్వేను చేసింది. ఈ సర్వే కోసం మొత్తం 10,409 మంది నుంచి అభిప్రాయాలను ఫోన్ కాల్స్ ద్వారా యాక్సిస్ మై ఇండియా సేకరించింది. ఇందులో కేవలం 30% మంది మాత్రమే సిటీలకు చెందిన వారు ఉండగా, మిగిలిన 70 % మంది రూరల్ ఏరియాలకు చెందిన వారే ఉన్నారని తెలిపింది.సర్వేలోని ముఖ్యమైన అంశాలు..
1) ఈ నెలలో 59% కుటుంబాల ఖర్చులు పెరిగాయి. ఇది కిందటి నెలతో పోలిస్తే 2 % తక్కువ.
2) పర్సనల్ కేర్, ఇండ్లలో వాడుకునే ఎసెన్సియల్ ప్రొడక్ట్లపై ఖర్చులు చేసిన కుటుంబాలు 37 శాతంగా ఉన్నాయి. కిందటి నెలతో పోలిస్తే ఈ కుటుంబాల ఖర్చులు 2 % తగ్గాయి.
3) ఆరోగ్యానికి సంబంధించి చేసిన ఖర్చులు కిందటి నెలతో పోలిస్తే ఒకేలా ఉన్నాయి.
4) వెకేషన్లు, మాల్స్, రెస్టారెంట్లకు వెళుతున్నామని 86 % మంది చెప్పారు.
పెట్రోల్, డీజిల్ రేట్లు ఇంకా తగ్గించొచ్చు..
1) సర్వే ప్రకారం, పెట్రోల్, డీజిల్ రేట్లను ఇంకా తగ్గించొచ్చని 50% మంది
రెస్పాండెంట్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్ తగ్గించడంపై 22% మంది సంతృప్తిగా ఉన్నారు. 16 శాతం మంది మాత్రం పెట్రో రేట్లపై అసంతృప్తిగా ఉన్నారు.
2) కొత్త సినిమాలు చూడడానికి థియేటర్లకు వెళుతున్నామని 10 % మంది అన్నారు.
3) 25% మంది ఈ సీజన్లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్నైనా చూశామని వివరించారు. ఐపీఎల్ను టీవీలలో చూశామని 65% మంది, ఆన్లైన్లో చూశామని 29 % మంది పేర్కొన్నారు. స్టేడియం నుంచి చూశామని 2 % మంది చెప్పారు.
4) పేరున్న బ్రాండ్లను కొనడం ముఖ్యమని 57% మంది రెస్పాండెంట్లు అభిప్రాయపడగా. 31 % మంది ధరలు కీలకమన్నారు.
5) పని ఒత్తిడి పెరగడంతో ఎర్లీ రిటైర్మెంట్ తీసుకుంటామని 13 % మంది చెప్పారు.