వనపర్తి/జడ్చర్ల/కొల్లాపూర్, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో శనివారం కురిసిన అకాల వర్షం రైతులను ఆగం చేసింది. వనపర్తి జిల్లా రేవల్లి, ఏదుల మండలాల్లోని చెన్నారం, తలుపునూరు, నాగపూర్, రేవల్లి, గౌరిదేవిపల్లి, కేశంపేట్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో వర్షంతో వడ్లు తడిసిపోయాయి. ఆత్మకూరు, మదనాపురం మండలాల్లోని తిరుమలాయపల్లి. దంతనూరు. రామన్ పాడు. శంకరమ్మ పేట గ్రామాల్లో బలమైన గాలులతో అర గంట భారీ వర్షం కురిసింది.
మదనాపురం మార్కెట్ యార్డులో ఆరబోసిన వడ్లు పూర్తిగా తడిసిపోయాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షంతో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ లో వడ్లు, మక్కలు తడిసిపోయి రైతులు నష్టపోయారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మక్కజొన్న, వడ్లు వర్షంతో తడిసిపోయాయి.
వరదలో కొట్టుకుపోతున్న పంటను కాపాడుకునేందుకు అవస్థలు పడ్డారు. కొల్లాపూర్ మండలం యన్మన్ బెట్ల గ్రామానికి చెందిన వెలగొండ వెంకటయ్య యాదవ్ కు చెందిన 30 గొర్రెలు పిడుగుపాటుతో చనిపోయాయి.
