న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోసారి తన నీచ బుద్ధిని బయటపెట్టుకుంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ బొమ్మను కరాచీలోని పాకిస్తాన్ ఎయిర్ఫోర్స్(పీఏఎఫ్) వార్ మ్యూజియంలో పెట్టింది. పాక్ జర్నలిస్టు, పొలిటికల్ ఎనలిస్టు అన్వర్ లోధి ట్విట్టర్లో ఈ ఫొటోను పోస్ట్ చేశాడు. దానికి ‘‘పీఏఎఫ్ మ్యూజియంలో అభినందన్ బొమ్మను పెట్టారు. అతడి చేతిలో టీకప్పు పెట్టిఉంటే మరింత ఇంటరెస్టింగ్గా ఉండేది”అని కామెంట్ పెట్టాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ ఎఫ్16ను వెంటాడుతూ మిగ్ 21లో సరిహద్దు దాటిన అభినందన్.. మిగ్ కూలిపోవడంతో పాక్ ఆర్మీ చేతికి చిక్కాడు. కస్టడీలో ఉన్న అభినందన్కు సంబంధించి పాక్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఆ టైమ్లో అతను చేతిలో కప్పు పట్టుకుని టీ తాగుతూ కనిపించాడు. ఇప్పుడు లోధి పోస్ట్ చేసిన ఫొటోలో ఓ గ్లాస్ షోకేస్లో అభినందన్ బొమ్మ, అతడి వెనుక పాక్ సోల్జర్ బొమ్మ పెట్టారు. అభినందన్ పక్కనే ఓ టీ కప్పు కూడా ఉంచారు. ఈ మధ్యనే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్కు ముందు ఓ పాక్ టీవీ చానల్ అభినందన్ను పాక్ సోల్జర్లు పట్టుకునే సీన్ను ఓ యాడ్ కోసం వాడారు. అది టీవీల్లో టెలికాస్ట్ అయ్యింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.

