హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.11,915.41 కోట్ల లోన్ తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టులోని ఎల్లూరు, ఏదుల, వట్టెం, ఉద్దండాపూర్ పంపుహౌస్లకు సంబంధించిన ఎలక్ట్రో మెకానికల్, హైడ్రో మెకానికల్ పనులు, సివిల్ వర్క్స్ చేయడానికి ఈ నిధులు వినియోగించనున్నారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధుల కొరత ఉండటంతో అప్పులు తీసుకునేందుకు కాళేశ్వరం కార్పొరేషన్లో ఇంక్లూడ్ చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి రూ.10వేల కోట్ల లోన్ తీసుకునేందుకు గతంలోనే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిధుల కొరత ఏర్పడటంతో కీలకమైన పనులు చేపట్టడానికి లోన్ మొత్తాన్ని పెంచాలని ఈఎన్సీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాన్ని పరిశీలించిన ప్రభుత్వం రూ.11,915.41 కోట్ల లోన్ తీసుకునేందుకు అనుమతినిస్తూ బుధవారం సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.