ప్రమాదాల వల్ల కొందరు ఇండ్లు, ఫ్యామిలీని పోగొట్టుకుంటే, మరికొందరు శరీర అవయవాలు కోల్పోతుంటారు. దాంతో ‘లైఫ్ అయిపోయింది. ఇకమీదట ఏం చేయాలన్నా పక్కవాళ్ల మీద ఆధారపడాల్సిందే’ అని బాధ పడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ‘శరీరం సహకరించకపోతే ఏం చేయలేం అనుకోవద్దు’ అంటున్నాడు నలబై ఆరేండ్ల మార్టిన్ హిబ్బర్ట్. అంతేకాదు వెన్నెముక దెబ్బతిని అవయవాలు పనిచేయని వాళ్లకోసం ‘స్పైనల్ ఇంజ్యూరీ అసోసియేషన్’ కోసం పనిచేస్తూ డొనేషన్స్ సేకరిస్తున్నాడు.
మార్టిన్ది యుకెలోని పెండిల్టన్. నడుము నుంచి కాళ్ల వరకు బాడీ పార్ట్స్ పని చేయవు. మాంచెస్టర్లో2017లో జరిగిన బాంబుదాడిలో గాయపడ్డ మార్టిన్కు వెన్నెముక దెబ్బతిన్నది. అప్పటినుంచి వీల్ చెయిర్కే పరిమితం అయ్యాడు. ఇంట్లో వాళ్లపైన ఆధారపడొద్దని, ప్రమాదం జరిగిన కొద్ది రోజుల నుంచే తన పని తాను చేసుకునేవాడు. కొన్ని రోజులకి ‘నాలాగే చాలామంది వీల్ చెయిర్కే అతుక్కుపోయి ఉండే వాళ్లలో, మానసికంగా కుంగిపోయే వాళ్లూ ఉంటారు. వాళ్లకేదైనా సాయం చేయాలి’ అనుకున్నా. అందుకే స్పైనల్ ఇంజ్యూరీ అసోసియేషన్ (ఎస్ఐఎ)లో చేరానని అన్నాడు మార్టిన్.
డొనేషన్స్ కోసం..
ఆ అసోసియేషన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ల కోసం డొనేషన్స్ సేకరిస్తుంది. ఆ డబ్బుతో కౌన్సెలింగ్ ఇప్పించటం, వీల్ చెయిర్స్, కేర్టేకర్స్, ఫిజియోథెరపిస్ట్లను ఏర్పాటు చేస్తుంటుంది. అసోసియేషన్ వాళ్లతో కలిసి తన వంతు సాయం చేయాలనుకున్నాడు. అందుకు టాంజానియాలో ఉండే కిలీమంజారో (5,895మీటర్ల ఎత్తు అంటే 19,340 అడుగులు) పర్వతాన్ని ఎక్కాలని డిసైడ్ అయ్యాడు. దానికోసం డొనేషన్స్ సేకరించాడు. అలా ఇప్పటి వరకు ఒక మిలియన్ పౌండ్లు అంటే తొమ్మిదిన్నర కోట్ల రూపాయలు డొనేట్ చేశాడు మార్టిన్. కిలీమంజారో ఎక్కుతున్నప్పుడు మార్టిన్కు సాయంగా కేర్టేకర్, ఫిజియో, డాక్టర్ కూడా తోడువెళ్లారు. ‘నడవలేని నేనే ఇంత చేశా. ప్రపంచంలో ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలీమంజారోను వీల్ చెయిర్ మీద కూర్చొని ఎక్కగలిగా. అలాంటిది మిగతా వాళ్లు ఇంకెంత చేయాలి’ అంటాడు మార్టిన్. ఈ పర్వతం ఎక్కాలన్నది వాళ్ల అమ్మ కోరిక. అది తీరకుండానే ఆమె చనిపోయింది. అందుకే ఆమె చితా భస్మాన్ని కిలీమంజారో పైన చల్లాడు. తరువాత ఆమెకు ఇష్టమైన పాట పెట్టి నివాళి అర్పించాడు మార్టిన్.