కడుపు నొప్పి భరించలేక..నిమ్స్ ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి రోగి మృతి

 కడుపు నొప్పి భరించలేక..నిమ్స్ ఆసుపత్రి బిల్డింగ్ పై నుంచి దూకి రోగి మృతి

హైదరాబాద్ నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి ఓ రోగి మృతి చెందాడు. జనవరి 28వ తేదీ ఆదివారం తెల్లవారుజామున ఓ రోగి.. తీవ్రమైన కడుపు నొప్పిని భరించలేక.. నిమ్స్ ఆసుపత్రి రెండంతస్తులోని స్పెషాలిటీ బ్లాక్ మీద నుంచి దూకాడు. దీంతో తీవ్రంగా గాయపడిని రోగి.. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ మరణించాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి వెళ్లి వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తిని ఖమ్మం జిల్లా మదిగొండ మండలం వై లక్ష్మాపురం గ్రామానికి చెందిన అచ్చయ్య(55)గా గుర్తించారు. జనవరి 16న చికిత్స కోసం సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజి విభాగంలో అచ్చయ్యను కుటుంబ సభ్యులు చేర్చారు. అయితే, శస్త్ర చికిత్స పూర్తయినా ఆయన ఆరోగ్యం  మెరుగుపడలేదు. ఈ క్రమంలో కడుపు నొప్పిని తట్టుకోలేక ఆస్పత్రి బిల్డింగ్ పై నుంచి దూకి తన తండ్రి చనిపోయినట్లు అచ్చయ్య కుమారుడు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.