తల్లి కళ్ళ ముందే కొడుకు మరణించడం చాలా బాధనిపించింది

తల్లి కళ్ళ ముందే కొడుకు మరణించడం చాలా బాధనిపించింది

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక తల్లి కళ్ళ ముందే కొడుకు మరణించడం చాలా బాధనిపించిందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. సోమ‌వారం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన ఉత్త‌మ్.. అక్క‌డ‌ వైద్య సేవలు ఎలా అందుతున్నాయో వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు, సరిపోనూ వైద్య సిబ్బంది లేర‌ని అన్నారు. నల్లగొండ, నిజామాబాద్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్, వెంటిలేటర్ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చి ప్రజలపై రూపాయి భారం పడకుండా వైద్యం అందించాలన్నారు ఉత్త‌మ్. కరోనాతో మృతి చెందిన పేదవారికి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, కరోనాతో పోరాడే ఫ్రంట్ వారియర్లకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరారు. కోవిడ్ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ తీరు రోమ్ నగరం తగలపడుతుంటే ఫిడేలు వాయించుకున్న చందంగా మారిందన్నారు. మూఢనమ్మకాల కోసం సెక్రటేరియట్ కూలగొట్టడం న్యాయమేనా అని ప్రశ్నించారు.