హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అడవులు, వన్యప్రాణుల కాపడుతూనే ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని పీసీసీఎఫ్ (హెచ్ఓఎఫ్ఎఫ్) వినయ్కుమార్ తెలిపారు. గురువారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో రాష్ట్రంలోని ఆరు ఎకో టూరిజం సర్క్యూట్ల అభివృద్ధిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వినయ్కుమార్ మాట్లాడుతూ.. ఎకో టూరిజం అభివృద్ధి పేరుతో అటవీ సంపదకు, జీవవైవిధ్యానికి ఎలాంటి నష్టం జరగడానికి వీల్లేదన్నారు.
స్థానిక గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి గైడ్లు, సఫారీ డ్రైవర్లు, బోటు ఆపరేటర్లు, హోమ్స్టే నిర్వాహకులుగా తీర్చిదిద్ది ఈ ప్రాజెక్టుల్లో భాగస్వాములను చేస్తామని వెల్లడించారు. అమ్రాబాద్– అచ్చంపేట సర్క్యూట్, కవ్వాల్– మంచిర్యాల సర్క్యూట్, కుంతాల జలపాతం కారిడార్, పాకాల– ములుగు– లక్నవరం హబ్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్లను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
