హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారు. ప్రజాశాంతి పార్టీ క్యాండిడేట్గా ఆయన్ను బరిలోకి దింపుతున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బుధవారం ప్రకటించారు. హైదరాబాద్లోని పార్టీ ఆఫీస్లో కేఏ పాల్, గద్దర్ మీడియాతో మాట్లాడారు. పదవులు ఆశించకుండా, ఏ పార్టీలో చేరకుండా ప్రజాసేవకుడిగానే గద్దర్ కొనసాగారని కేఏ పాల్ అన్నారు. గద్దర్కు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు మద్దతిస్తే పార్టీ తరఫున కాకుండా ఇండిపెండెంట్గా బరిలో ఉంచుతామన్నారు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు మునుగోడు లోనే ఉండి ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తానని పాల్ తెలిపారు. తన కంటే కేసీఆర్, కేటీఆర్ బాగా మాట్లాడుతారని, కానీ ప్రజలకు కావాల్సింది మాటలు కాదని, చేతలని పాల్ అన్నారు. సమాజంలో ఓట్ల విప్లవం వచ్చి జనంలో మార్పు రావాలని గద్దర్ అన్నారు. 80 శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు తమ ఓట్లు తామే వేసుకోవాలన్నారు. మునుగోడులో బలమైన పార్టీలు, అభ్యర్థులు పోటీలో ఉన్నారని, తన దగ్గర కట్టుబట్టలు, గొంగడి తప్ప ఏమీ లేదన్నారు. పార్టీలో చేరాలని చాలా మంది అడిగారని, తాను మాత్రం చేరలేదన్నారు.
తొలిసారి ఎన్నికల బరిలోకి..
గద్దర్ తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో ఊపు తెచ్చిన ఆయన రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏ పార్టీలో చేరలేదు. అప్పుడప్పుడు పలు వేదికలపై కన్పించినా పూర్తి స్థాయిలో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వలేదు. మూడు పార్టీలు పోటాపోటీగా తలపడుతున్న మునుగోడులో గద్దర్ పోటీ చేస్తుండడంపై ఆసక్తి నెలకొంది.