ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్

మునుగోడులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోషల్ యాక్టివిస్ట్ శివప్రసాద్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్ చేస్తోందంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలతో పాటు సామాన్యుల ఫోన్లను కూడా తెలంగాణ ప్రభుత్వం టాప్ చేస్తోందని వివరించారు. రాష్ట్ర హోం శాఖ సెక్రటరీ, డీజీపీ, సైబరాబాద్ సీపీని బాధ్యులుగా చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. 

ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 5 (2) నిబంధనలను ఉల్లంఘించి.. ప్రజల వ్యక్తిగత వివరాలను ట్యాపింగ్ చేస్తున్నారని శివప్రసాద్ ఆరోపించారు. ఫోన్ ట్యాప్ చేయడం‭తోనే ఫామ్ హౌస్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణను డిమాండ్ చేస్తూ బీజేపీ వేసిన పిటిషన్‭తో కలిపి.. నవంబర్ 4న విచారణ జరుపుతామని  తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. 

అంతకుముందు ఇవాళ ఉదయం టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నేతలు బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అందులో ప్రస్తావించారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా నగదు లావాదేవీలకు సంబంధించి అక్రమ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీపై ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ స్వయంగా గూగుల్ పే, ఫోన్ పే ద్వారా మునుగోడు ఓటర్లకు డబ్బు పంపుతోందని చుగ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు టీఆర్ఎస్ కోసం ప్రచారం చేస్తున్నాయని తరుణ్ చుగ్ ఆరోపించారు. టీఎన్జీఓ, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. టీఎన్జీఓ నేతలైన మనిల రాజేందర్, శ్రవణ్ కుమార్ తో పాటు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ థామస్ టీఆర్ఎస్కు ఓటేసేలా మునుగోడులోని ప్రభుత్వ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని చుగ్ ఎన్నికల సంఘాన్ని కోరారు.