
- ఇండియన్స్కు హాని తలపెట్టేవారిని వదలం
- ఢిల్లీలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరు
న్యూఢిల్లీ: టెర్రరిజంపై తన ఇండియా వైఖరేంటో.. ఆపరేషన్ సిందూర్తో ఇండియా స్పష్టం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇండియన్స్కు హాని తలపెట్టే వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఎక్కడ దాక్కున్నా.. వెతికి పట్టుకుని మరీ శిక్షిస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ పేరు ప్రస్తావించకుండానే ఆయన ఈ హెచ్చరికలు చేశారు. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని తేల్చి చెప్పారు. ఆ దిశగానే తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శ్రీ నారాయణ గురు, మహాత్మా గాంధీ మధ్య శివగిరి మఠంలో జరిగిన చారిత్రక సంభాషణ శతాబ్ది ఉత్సవాన్ని మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ నారాయణ ధర్మ సంఘం ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలతో శత్రువును 22 నిమిషాల్లోనే మోకాళ్లపై కూర్చోబెట్టాం. 11 ఏండ్ల ఎన్డీఏ పాలనలో సోషల్, ఎకనామిక్, డిఫెన్స్ సెక్టార్లను ఎంతో అభివృద్ధి చేశాం. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత సాధించాం. సైనిక అవసరాల కోసం విదేశాలపై మనం ఇప్పుడు తక్కువగా ఆధారపడుతున్నాం. ఆపరేషన్ సిందూర్లో దీని ప్రభావం కనిపించింది’’అని మోదీ అన్నారు.
హౌసింగ్, డ్రింకింగ్ వాటర్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. గడిచిన 11 ఏండ్లలో ఎన్నో ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ ప్రారంభించామని చెప్పారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఇండియా నిలిచిందని తెలిపారు. శ్రీ నారాయణ గురు సిద్ధాంతాలను మోదీ గుర్తు చేశారు. ‘వన్ ఎర్త్, వన్ హెల్త్’, ‘వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్’, జీ20 సమావేశంలో ‘వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్’ వంటి థీమ్లు వసుధైవ కుటుంబకం స్ఫూర్తితో ఉన్నాయని మోదీ తెలిపారు. శ్రీ నారాయణ గురు సిద్ధాంతాలు..
మానవాళికి గొప్ప సంపద అని అన్నారు.