మోడీ టూర్ షెడ్యూల్.. 2 రోజుల్లో 7 నగరాలు 8 పర్యటనలు

మోడీ టూర్ షెడ్యూల్.. 2  రోజుల్లో 7 నగరాలు 8 పర్యటనలు

ప్రధాని మోడీ ఏప్రిల్ 24, 25న సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 36 గంటల్లో 5,300 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. రెండు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 7 నగరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మోడీ టూర్ కు సంబంధించిన టూర్ షెడ్యూల్ ను అధికారులు వెల్లడించారు.  


ప్రధాని బిజీ టూర్ షెడ్యూల్

ప్రధాని మోడీ సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్  వెళ్లనున్నారు. అక్కడి నుంచి కేరళకు చేరుకుంటారు. ఆ తర్వాత  కేంద్ర పాలిత ప్రాంతమైన  డమన్‌ డయ్యూ - దాద్రా నగర్‌ హవేలీలో పర్యటించి తిరిగి మంగళవారం ఢిల్లీ చేరుకుంటారు. మోడీ ముందుగా ఢిల్లీ నుంచి 500 కి.మీల దూరంలో ఉన్న  మధ్యప్రదేశ్‌ లోని ఖజురహో చేరుకుంటారు. అక్కడి నుంచి రేవా వెళ్లి జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి ఖజురహో  వెళ్లనున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి 1700కిలోమీటర్ల దూరంలో ఉన్న కోచి  వెళ్లి యువమ్‌ సదస్సులో మోడీ పాల్గొననున్నారు.  

ఇక ఏప్రిల్ 25 మంగళవారం ఉదయం కోచి నుంచి ఆయన 150 కి.మీల దూరంలో ఉన్న తిరువనంతపురం చేరుకోనున్నారు.  అక్కడ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. దీంతో  పాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.కేరళ పర్యటన ముగించుకుని మోడీ 1570కి.మీల దూరంలో ఉన్న సిల్వస్సా (డామన్‌ డయ్యూ) చేరుకుంటారు. అక్కడ నమో మెడికల్‌ కాలేజీ సందర్శనతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుంచి డమన్‌ చేరుకుని డేవ్కా సీఫ్రంట్‌ను ప్రారంభించనున్నారు. అక్కడ పర్యటన ముగించుకుని తిరిగి ఢిల్లీకి వెళ్తారు. అయితే ఈ పర్యటన అంతా కేవలం 36 గంటల్లోనే ముగియనుంది.