ప్రాజెక్టుల్లో నీళ్లున్నా సాగుకు ఇవ్వట్లేదు: పోచారం

ప్రాజెక్టుల్లో నీళ్లున్నా సాగుకు ఇవ్వట్లేదు: పోచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నీళ్లున్నా రైతులకు ప్రభుత్వం సాగు నీరు ఇవ్వట్లేదని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వైరీని స్వాగతిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం ఎడారిగా మారిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లలో 30 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయని, వాటితో 2.5 లక్షల ఎకరాలకు సాగు నీరు ఇవ్వొచ్చని తెలిపారు.

సాగు నీటి విడుదలపై నిర్ణయం తీసుకోకుండా భూములు పడావు పెట్టారని, రైతులపై ఎందుకంత కోపమని ప్రశ్నించారు. ఇప్పటికైనా రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీళ్లను ఆయకట్టుకు ఇచ్చి, యాసంగిలో పంటల దిగుబడి తగ్గకుండా చూడాలని సూచించారు. తాగు నీటి పేరుతో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద క్రాప్ హాలిడే ఇచ్చారని మండిపడ్డారు. 

సంక్షేమ పథకాల అమలులో దళారీ వ్యవస్థ: జగదీశ్ రెడ్డి

సంక్షేమ పథకాల అమల్లో దళారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలు, ప్రజలు కోరుకున్న రీతిలో బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం సమపాలల్లో అందించిన కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.