
- ఇద్దరు గిరిజన మహిళలను మధ్యప్రదేశ్ లో అమ్మకం
- ఆధార్ అప్ డేట్ తో వెలుగులోకి రాగా..తొమ్మిది మందిపై కేసు
- ఆరుగురిని అదుపులోకి తీసుకోగా.. పరారీ లో మరో ముగ్గురు
- నిందితుల్లో ఓ పోలీస్ కానిస్టేబుల్
- ఆసిఫాబాద్ డీఎస్పీ రామానుజం వెల్లడి
ఆసిఫాబాద్,వెలుగు : మహిళల అక్రమ రవాణా ముఠాను ఆసిఫాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. బుధవారంమీడియా సమావేశంలో ఇన్ చార్జ్ డీఎస్పీ రామానుజం వివరాలు వెల్లడించారు. ఆసిఫాబాద్ మండలం వాడిగొంది గ్రామానికి చెందిన యువతి ఏడాది కిందట తప్పిపోవడంతో తండ్రి వెతుకుతున్నాడు. సదరు యువతి ఆధార్ అప్ డేట్ కార్డు పోస్టులో ఇంటికి వచ్చింది. దీంతో అవాక్కైన తండ్రి ఆధార్ కార్డు పై ఉన్న ఫోన్ నంబర్ కు కాల్ చేయగా మధ్యప్రదేశ్ కి చెందినదని తెలియడంతో అనుమానించి వెంటనే ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేస్తుండగా.. జిల్లా కేంద్రానికి చెందిన మరో బాధితురాలు పోలీసులకు కంప్లయిట్ చేసింది.
దీంతో కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు అసలు వాస్తవాలు తెలిశాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా మహిళల అక్రమ రవాణా విషయం బయటపడింది. తొమ్మిది మంది నిందితులను గుర్తించగా వీరిలో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఇందులో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. మిస్సింగ్ అయిన యువతిని రూ. లక్ష 30 వేలకు, మరో మహిళను రూ. లక్ష 10 వేలకు అమ్మినట్టు పట్టుబడిన నిందితులు తెలిపారు.
ప్రధాన నిందితురాలు మంచిర్యాల జిల్లా ఇందిరమ్మ కాలనీకి చెందిన పరికిపండ్ల విజయలక్ష్మి, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన సత్యంశెట్టి సుజాత, రాజంపేటకు చెందిన పంచపుల, వాంకిడి మండలం బెండరకు చెందిన తాడూరి ఉష, గతంలో సస్పెండైన కానిస్టేబుల్ హరిదాస్, మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయికి చెందిన దుర్గం సుధాకర్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ చేసినట్లు చెప్పారు. మధ్యప్రదేశ్ లోని జావ్రాకు చెందిన రమేశ్ గౌడ్, సురేఖ, జగదీశ్పరారీలో ఉన్నారన్నారు. పోలీసులు ప్రత్యేక టీమ్ ను మధ్యప్రదేశ్ పంపారు. బైక్ , మొబైల్ ఫోన్స్ , రూ. 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇలాంటి కేసుల్లో హరిదాస్, సురేఖ ఇప్పటికే నిందితులుగా ఉన్నారు. బాధిత మహిళలిద్దరూ ఎస్టీలు కావడంతో అట్రాసిటితో పాటు మానవ అక్రమ రవాణా కేసులను, లైంగిక నేరాల కేసు, అనైతిక నేరాల కేసులను నమోదు చేశారు. ఒంటరి మహిళలను, పెళ్ళికానివారిని, భర్త చనిపోయిన వారిని లక్ష్యంగా చేసుకొని ఇటువంటి ముఠాలు పనిచేస్తున్నాయని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ,ఎవరైనా అలాంటి వారు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.