
హైదరాబాద్,వెలుగు : సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. సెక్రటేరియట్,అసెంబ్లీ, బేగంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ సహా సీఎం, మంత్రుల కాన్వాయ్లు వెళ్లే రూట్లను స్టడీ చేస్తున్నారు. సాధారణ ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ముందు ఉన్న గన్పార్క్ జంక్షన్ను సిగ్నల్ ఫ్రీ జంక్షన్గా మార్చారు. నాంపల్లి, లక్డీకపూల్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఆగకుండా ఏర్పాట్లు చేశారు.
బషీర్బాగ్ నుంచి లక్డీకపూల్ వైపు వెళ్లే ట్రాఫిక్ను ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ చేశారు. బషీర్బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వెహికల్స్.. ఓల్డ్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకుని ఏఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో యూ టర్న్ తీసుకుంటున్నాయి. దీంతో పబ్లిక్ గార్డెన్స్, అసెంబ్లీ ముందు వెహికల్స్ నిలిచే అవకాశం ఉండదు. ఈ ట్రయల్ రన్ మంచి ఫలితాలు ఇస్తే యూటర్న్ను కంటిన్యూ చేయాలని ట్రాఫిక్ పోలీసులు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లోనూ సిగ్నల్ ఫ్రీ సిస్టమ్ను అమలు చేస్తున్నారు. సీఎం, మంత్రుల కాన్వాయ్ మూవ్మెంట్స్ సమయాల్లో సాధారణ ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్లానింగ్ రూపొందిస్తున్నారు.
బేగంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పరిశీలన
ట్రాఫిక్ ఎక్కువగా ఉండే బేగంపేట పరిసరాలపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణికి జనం పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకుల వాహనాల పార్కింగ్, సికింద్రాబాద్, పంజాగుట్ట నుంచి ట్రావెల్ చేసే వెహికల్స్కు ఫ్రీ మూవ్మెంట్ ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లోనూ ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తున్నారు. సీఎం వెళ్లే రూట్లో సమస్యలు తలెత్తకుండా అవసరమైన విధంగా గ్రీన్ చానల్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.